Porsche Accident Case: పుణేలో పోర్షే కార్ యాక్సిడెంట్‌ (Pune Porsche Accident) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓ మైనర్‌ ఆ కార్‌ని వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి బైక్‌కి ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 17 ఏళ్ల కుర్రాడు పార్షీ కార్‌ ఎలా నడిపాడు..? తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు..? అనే చర్చ జరుగుతుండగానే కార్‌ డ్రైవింగ్‌కి ముందు ఓ పబ్‌లో నిందితుడు కనిపించడం మరింత వివాదాస్పదమైంది. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేసి ఇద్దరు ప్రాణాలు తీసినందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. కానీ...ఆ మైనర్ తండ్రి మాత్రం ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తనపై FIR నమోదైన వెంటనే ఎస్కేప్ అవ్వాలని చూశాడు. పోలీసులను మిస్‌లీడ్ చేసేందుకు ఇల్లు విడిచిపెట్టి తన కార్‌లో వెళ్లిపోయాడు. ముంబయికి వెళ్లాలని డ్రైవర్‌కి చెప్పాడు. మరో కార్‌ డ్రైవర్‌కి గోవా రమ్మని ఆర్డర్ వేశాడు. ముంబయికి వెళ్లే దారి మధ్యలోనే దిగిపోయాడు. అక్కడి నుంచి ఫ్రెండ్ కార్‌లో ఛత్రపతి సాంబాజీ నగర్‌ వరకూ వెళ్లాడు. ఇలా మూడు నాలుగు కార్లలో ప్రయాణించి పోలీసుల కళ్లుగప్పేందుకు ప్రయత్నించాడు. అంతే కాదు. పాత ఫోన్‌ నంబర్‌ తీసేసి వెంటనే కొత్త సిమ్‌ కార్డ్ కొనుక్కున్నాడు. పోలీసులు ట్రాక్ చేయకుండా ఉండేలా ఈ ప్లాన్ వేశాడు. అయితే..మైనర్ తండ్రి ఫ్రెండ్ కార్‌లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడ ఉన్నాడో గుర్తించారు. ఓ లాడ్జ్‌లో దాక్కున్నాడని తెలిసి అక్కడికి వెళ్లి రెయిడ్స్ చేసి అరెస్ట్ చేశారు. త్వరలోనే ఆ వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 


బెయిల్ ఇవ్వడంపై విమర్శలు..


యాక్సిడెంట్ చేసిన 15 గంటల్లోనే మైనర్‌కి బెయిల్ రావడంపై (Porsche Car Accident) ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. కండీషనల్ బెయిల్ ఇచ్చినప్పటికీ వివాదాస్పదమైంది. ట్రాఫిక్‌ పోలీసులతో పాటు 15 రోజులు పనిచేయడంతో పాటు 300 పదాలతో ప్రమాదాలకు సంబంధించిన ఓ ఆర్టికల్ కూడా రాయాలని కోర్టు ఆదేశించింది. డ్రింకింగ్ అలవాటు మానేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని తేల్చి చెప్పింది. అయితే...17 సంవత్సరాల 8 నెలల వయసున్న నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని పోలీసులు  juvenile justice board ని ఢిల్లీ పోలీసులు ఆశ్రయించారు. అయితే...దీనిపై బోర్డ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మైనర్ కావడం వల్ల కొన్ని చట్టాలు వర్తించడం లేదని, మేజర్‌గా పరిగణిస్తే కఠిన చర్యలు తీసుకోడానికి వీలుటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మైనర్‌కి బెయిల్ ఇవ్వడమే వివాదాస్పదమవుతోంది. ఈ ఎలక్ట్రిక్ పార్షీ కార్ రూ.2.5 కోట్లు. కానీ...ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ కాలేదు. రూ.1758 ఫీజ్‌ చెల్లించని కారణంగా రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో ఉంది. అసలు ఇప్పటి వరకూ RTO ఆఫీస్‌కి కార్‌ తీసుకురాలేదని అధికారులు చెబుతున్నారు. పుణే సిటీలోనే బడా రియల్టర్ కొడుకు కావడం వల్ల యాక్సిడెంట్ చేసినా వెంటనే బెయిల్ ఇచ్చారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


 Also Read: Masala Powders: ఆ మసాలా పౌడర్‌లు హానికరం కావు, తేల్చి చెప్పిన ఫుడ్‌ సేఫ్‌టీ సంస్థ