Pulwama Attack Mastermind Terrorist Shot Dead: భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా దాడి ప్రధాన సూత్రధారులలో ఒకడైన హమ్జా బుర్హాన్ అలియాస్ డాక్టర్ అంతం PoK గడ్డపైనే జరిగింది. ముజఫరాబాద్లోని తన కార్యాలయంలో కూర్చుని ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుండి అతడి తల , శరీరంలోకి బుల్లెట్లను దించారు. గత కొంతకాలంగా పాకిస్థాన్లో ఉగ్రవాదులను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వేటాడి చంపుతున్న వరుసలో ఇప్పుడు హమ్జా బుర్హాన్ కూడా చేరాడు. ఈ దాడితో పాక్ ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదుల్లో వణుకు మొదలైంది. ఇదేదో ధురంధర్ ఆపరేషన్ లా ఉందని భయపడుతున్నారు.
విద్యార్థి నుంచి ఉగ్రవాదిగా..
దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా రత్నిపోరాకు చెందిన హమ్జా బుర్హాన్ , 2017లో ఉన్నత విద్య కోసం వీసాపై వాఘా బోర్డర్ ద్వారా పాకిస్థాన్కు వెళ్లాడు. అక్కడ చదువును పక్కనపెట్టి నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్ లో చేరాడు. అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థలో కమాండర్గా ఎదిగి, భారత్పై దాడులకు ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా 2019 పుల్వామా దాడిలో ఇతడి పాత్ర అత్యంత కీలకమని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దీనిపై విచారణ జరిపిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2022లో ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించి UAPA చట్టం కింద నోటిఫికేషన్ విడుదల చేసింది.
టీచర్గా నకిలీ వేషం.. ఐఎస్ఐ అండ
పాకిస్థాన్లో తన ఉగ్రవాద మూలాలను దాచుకోవడానికి బుర్హాన్ ఒక పాఠశాలలో టీచర్గా, ప్రిన్సిపాల్గా నకిలీ వేషం వేసుకున్నాడు. అయితే తెరవెనుక మాత్రం ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, సరిహద్దుల గుండా వారిని భారత్లోకి చొప్పించడం వంటి పనులను పర్యవేక్షించేవాడు. పాక్ గూఢచారి సంస్థ ISI అతడికి కార్యాలయంతో పాటు AK-47 తుపాకులు ధరించిన సాయుధ గార్డులతో రక్షణ కల్పించింది. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా అతడిని మట్టుబెట్టారు.
ఉగ్ర నెట్వర్క్కు భారీ దెబ్బ
హమ్జా బుర్హాన్ మరణం 'అల్-బదర్' సంస్థకు , కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న శక్తులకు భారీ దెబ్బ. కేవలం దాడులకే పరిమితం కాకుండా, సోషల్ మీడియా ద్వారా లోకల్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం లో ఇతడు సిద్ధహస్తుడు. ఇతడి మరణంతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నియామకాలు, ప్రచార కార్యక్రమాలు కుంటుపడే అవకాశం ఉందని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన వ్యక్తికి ఎట్టకేలకు న్యాయం జరిగిందని నెటిజన్లు స్పందిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తుల వరుస వేట
గత రెండేళ్లుగా పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న టాప్ టెర్రరిస్టులు ఒకరి తర్వాత ఒకరు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. రియాజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ పీర్ వంటి వారి తర్వాత ఇప్పుడు హమ్జా బుర్హాన్ వంతు వచ్చింది. పాకిస్థాన్ వీరందరి మరణాలను ధృవీకరిస్తున్నా, చంపిన వారిని మాత్రం పట్టుకోలేకపోతోంది. భారత శత్రువులను విదేశీ గడ్డపై కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదనే సంకేతం ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది.
