Priyanka Money Laundering Case: 



మనీలాండరింగ్ కేసు..


మనీలాండరింగ్ యాక్ట్ కింద దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో తొలిసారి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేరుని చేర్చింది ఈడీ. హరియాణాలోని ఫరియాబాద్‌లో 2006లో 5 ఎకరాల వ్యవసాయ భూమిని ఢిల్లీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ నుంచి కొనుగోలు చేశారు ప్రియాంక. 2010 ఫిబ్రవరిలో ఇదే భూమిని మళ్లీ అదే ఏజెంట్‌కి విక్రయించారు. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారని ఆరోపిస్తోంది ఈడీ. ప్రియాంకతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరునీ ఈ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. అయితే...నిందితుల జాబితాలో మాత్రం చేర్చలేదు. వీళ్లతో పాటు NRI బిజినెస్‌మెన్ థంపి పేరు కూడా చేర్చింది. ఈ లావాదేవీలతో ఆయుధాల డీలర్ సంజయ్ బంఢారికి లబ్ధి చేకూర్చారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తం కేసులో బంఢారిని నిందితుడిగా పేర్కొంది ఈడీ. 2016లోనే లండన్‌కి పారిపోయిన సంజయ్ బంఢారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఈడీ సహా సీబీఐ యూకేని రిక్వెస్ట్ చేసింది. అందుకు యూకే అంగీకరించింది. ఫరియాబాద్‌లోని అమీపూర్‌లో రాబర్ట్ వాద్రా పేరిట ఓ ఇల్లు కొనుగోలు చేశారని, 2006లో ఇదే ఇంటిని మళ్లీ అదే ఏజెంట్‌కి విక్రయించారని ఆరోపిస్తోంది ఈడీ. ఆ ఏజెంట్ పేరు పహ్వాగా పేర్కొంది. 2005-06 మధ్య కాలంలో పహ్వా నుంచి రాబర్ట్ వాద్రా 40.8 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడని, 2010 డిసెంబర్‌లో మళ్లీ ఇదే ల్యాండ్‌ని పహ్వాకి విక్రయించాడని ఈడీ ఆరోపిస్తోంది. బిజినెస్‌ థంపితోనూ దాదాపు ఇదే డీల్ కుదిరింది. 486 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2020లో థంపి అరెస్ట్‌ అయ్యి బెయిల్‌పై విడుదలయ్యాడు. గతంలోనూ పలు కేసుల్లో రాబర్ట్ వాద్రాని విచారించింది ఈడీ. కానీ తొలిసారి ఆయన పేరుని ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. అయితే...ఈ ఛార్జ్‌షీట్‌పై ఇప్పటి వరకూ రాబర్ట్ వాద్రా స్పందించలేదు.