Private jet crashes:  ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రైవేట్ జెట్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లాలోని నారాయణపూర్ ప్రాంతంలో ఉన్న ఆరా హిల్స్ (Ara Hills) వద్ద ఈ చార్టర్డ్ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. కొండను ఢీకొన్న వెంటనే విమానంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.                             

Continues below advertisement

ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న పైలట్,  కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ చిన్న ప్రైవేట్ జెట్ ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థకు చెందినదిగా తెలుస్తోంది. విమానంలో పైలట్లు మినహా ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. మృతుల వివరాలను సేకరించేందుకు , వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.    

ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. విమానం చాలా తక్కువ ఎత్తులో  సుమారు 30 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా కొండను లేదా చెట్లను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాతావరణం అనుకూలించక పోవడం లేదా సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలంలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.                                      

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. జష్‌పూర్ ఎస్పీ స్వయంగా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తూ, విమాన గమ్యం , ఇతర సాంకేతిక వివరాలను సేకరిస్తున్నారు. జష్‌పూర్ జిల్లాలోని దట్టమైన అటవీ,  కొండ ప్రాంతం కావడం వల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. విమాన బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాతే ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.