Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి శుభవార్త అందింది. ప్రాజెక్టులో కేవలం సాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని చెప్పిన సర్కారు.. ఇప్పుడు తాగునీటి విభాగం పనులకు అయ్యే ఖర్చును కూడా భరిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన వినతులను పరిశీలించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత వ్యయాన్ని తిరిగి చెల్లించేందుకు సుముఖుత వ్యక్తం చేసింది. రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి 55 వేల 548 కోట్ల రూపాయల నిధుల గురించి విజయ సాయిరెడ్డి ప్రశ్నించగా... జలశక్తి మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు జవాబు ఇచ్చారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి 10 వేల 911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టు నిర్మాణం మరమ్మతుల కోసం అదనంగా మరో రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాడనికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. 


 తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే కాంపోనెంట్ వారిగా నిధుల చెల్లింపుల వల్ల ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం అవుతుందని వివరించారు. చాలా సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కాంపోనెంట్ వారి చెల్లింపులపై సీలింగ్ ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సీలింగ్ ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయవిభాగం గత జూన్ 5వ తేదీన తమకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు వెల్లడించారు.   


మరోవైపు పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై చర్యలు 


పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపునకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటి పారుదల శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపింది. అలాగే నీటి సంవత్సరం మొత్తం స్పిల్ వే గేట్లతో పాటు రివర్ స్లూయిస్ కూడా తెరిచి ఉంచాలని సూచించింది. గోదావరి జలవివాద ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో ముంపు సమస్య లేకుండా చూడాలని వివరించింది. అందుకోసం తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పింది. ప్రాజెక్టు చేపట్టకముందే పరిస్థితి బాగుండేదని చెప్పుకొచ్చింది. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నది స్వేచ్ఛగా ప్రవహించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు లేఖ రాశారు. ఇదే లేఖను కేంద్ర జలసంఘానికి కూడా పంపారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ సర్వే చేయించాలని కోరారు. 


తెలంగాణ సర్కారు 2016 సంవత్సరం నుంచి సుధీర్ఘంగా చర్చలు జరుపుతూనే ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యపై తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఆయా రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించినట్లు వివరించారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించిందన్నారు. బ్యాక్ వాటర్ ప్రభావం, స్థానిక వాగు నుంచి నీళ్లు నదిలోకి రాకుండా వెనక్కి నెట్టడంపైనా మరోసారి అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ ఛైర్మన్ కూడా సూచించినట్లు వెల్లడించారు. ఐటీసీ సారపాక, మణుగూర్ హవీ ప్లాంటు, భద్రాచలం పట్టణంతో పాటు చారిత్రక రామాలయంపై పడే ప్రభావానికి సంబంధించి ప్రాజెక్టు అథారిటీతో కలిసి సంయుక్త సర్వే చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.