What India will do: కశ్మీర్ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సౌదీ పర్యటనను ముందుగానే ముగించుకుని వచ్చారు. ఎయిర్ పోర్టులోనే అత్యున్నత సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా నేరుగా ఘటనా ప్రాంతానికి వెళ్లారు. ఉగ్రవాదానికి భారత్ తల వంచదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ కీలక అధికారులతో చర్చలు జరుపుతున్నారు. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సమావేశమయ్యారు. అప్పమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు.
ఇటీవలి కాలంలో తమపై జరుగుతున్న ఉగ్ర దాడుల్ని ఏ దేశం కూడా సహించడం లేదు. ఉగ్రవాదం కాకపోయినా తమకు ముప్పుగా మారుతోందని ఉక్రెయిన్ ను నేల మట్టం చేసింది రష్యా. మధ్య ప్రాచ్యంలోనూ అలాంటివే జరుగుతున్నాయి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ను ఎందుకు సహించాలన్న ప్రశ్న వస్తోంది. రష్యా ఉక్రెయిన్ ను ఎలా అణిచివేసిందో అలా అణిచి వేయాలన్న వాదన వినిపిస్తోంది. ఈ దిశగా భారత్ సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ సైలెంట్గా ఉండే అవకాశాల్లేవని రక్షణ నిపుణులు అంటున్నారు.
పాకిస్తాన్ కూడా భారత్ తమపై దాడి చేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దాడి చేస్తే కాచుకోవడానికి సిద్ధమని సంకేతాలు పంపుతూ.. సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలను మోహరిస్తోంది. సైనికుల్ని అప్రమత్తం చేస్తోంది. అయితే పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ లో నిధులు కేటాయించడంలేదు. సైనికులకు జీతాలు ఇస్తే గొప్పన్నట్లుగా ఉంది. వారి యుద్ధ సన్నాహాలన్నీ పైకి మాత్రమేనని అంటున్నారు.
భారత్ ఒక్క రోజు చేసే దాడితో పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉంది. ఇప్పుడు భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. అందుకే .. దేశానికి చిన్న నష్టం జరగకుండా పాక్ అంతు చూసేందుకు స్కెచ్ వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
