Train Hijack Incident: తమ దేశంలో పరిస్థితిని చక్కదిద్దుకోలేని పాకిస్తాన్ ..ఏదైనా జరిగితే భారత్ పై ఏడవడం మాత్రం ఆపలేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రైలు హైజాక్ దాడి ఘటన వెనుక భారత్ ఉందని తాజాగా అంటోంది. ట్రైన్ హైజాక్ ఘటనలో 21 మంది ప్రయాణికులు , 30 మందికి పైగా పాకిస్తానీ భద్రతా సిబ్బంది మరణించారు. ట్రైన్ హైజాకింగ్ ఘటన పై పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో భారతదేశం ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే బలూచ్ ఘటనలో మాత్రం ఆఫ్ఘనిస్థాన్ నుంచి కాల్స్ వచ్చినట్లుగా గుర్తించామని ఆయన చెబుతున్నారు.
ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కుట్రలుచేస్తూ బలూచ్ ఉగ్రవాదులతో నేరుగా సంప్రదింపులు జరిపారని షఫ్కత్ అలీ ఖాన్ అంటున్నారు. BLA వంటి ఉగ్రవాద సంస్థలు తమ భూభాగాన్ని ఉపయోగించడాన్ని ఆపాలని ఆఫ్ఘనిస్తాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేసారు. ఇలాంటివి ఆపకపోతే ఆప్ఘన్పై పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. బీఎల్ఏకు సహకారం అందిస్తున్న వారిపై ఆఫ్ఘనిస్తాన్ పాలకులైన తాలిబన్లకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిని పట్టుకోవడానికి సహకరించాలన్నారు.
మొత్తం పాకిస్తాన్ నుంచి జరిగిందంటూనే భారత్ పై నిందలేస్తున్న పాకిస్తాన్ వైఖరిని భార్త ఖండించింది. నిరాధారమైనవిగా పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాకిస్తాన్ పైమండిపడ్డారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. బాధ్యతను తిప్పికొట్టడానికి ప్రయత్నించకుండా పాకిస్తాన్ తన సొంత సమస్యలపై దృష్టి పెట్టాలని భారత్ సలహా ఇచ్చింది.
పాకిస్తాన్ ను అస్థిరపరిచే ప్రయత్నాలను భారత్ చేస్తోందని పాకిస్తాన్ ఆరోపణ. పొరుగు దేశాలను అస్థిరపరిచేందుకు టెర్రరిస్టు దేశమనే ప్రచారాన్ని నడుపుతోందని అంటోంది. ట్రైన్ హైజాక్ జరిగిన తర్వాత భారత మీడియా బలూచ్ లిబరేషన్ ఆర్మీని పొగుడుతోందని ఇది భారతదేశం అనధికారిక వైఖరిని ప్రతిబింబిస్తుందని పాకిస్తాన్ అంటోంది. ఆధారాల్లేకుండా అనాలోచితంగా పాకిస్తాన్ చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య కొత్త సమస్యలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.