Nowhere In Iran Says Netanyahu: ఇజ్రాయెల్‌కు 50 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న హెజ్బొల్లా అగ్రమేత హసన్ నస్రల్లాను బైరూట్‌పై వైమానిక దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం మట్టుపెట్టింది. ఈ హత్యకు తానే వ్యక్తిగతంగా ఆదేశాలు ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు స్పష్టం చేశారు. నస్రల్లా మరణంతో ఇకపై ప్రపంచానికి ఒక ఉగ్రవాది ముప్పు తప్పిందని బెంజిమన్ వ్యాఖ్యానించారు. వందలాది హెజ్బొల్లా టార్గెట్లను ధ్వంసం చేయడం ద్వారా ఆ భారీ భవంతుల సెల్లార్ కలుగుల్లో దాక్కున్న నస్రల్లా సహా హెజ్బొల్లా కమాండర్లను పదుల సంఖ్యలో హతమార్చినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులను సురక్షితం చేసే వ్యూహంలో నస్రల్లా మరణం తమ దేశ సైన్యం సాధించిన ఒక కీలక విజయంగా నెతన్యాహూ అభివర్ణించారు. నస్రల్లా హత్యతో 1980ల నుంచి అతడు సాగించిన మారణ హోమంలో బలైన వందలాది ఇజ్రాయేలీలు, ఫారినర్స్‌ ఆత్మలు శాంతిస్తాయని నెతన్యాహూ చెప్పారు.


నస్రల్లా సైన్యం దాడులు:


1983లో బైరూట్‌లోని యూఎస్ ఎంబసీపై దాడిలో మరణించిన 63 మందితో పాటు హెజ్బొల్లా దాడుల్లో వందలాది మంది యూఎస్‌ మెరైన్స్‌, ఫ్రెంచ్ పారట్రూపర్స్ చనిపోయారని నెతన్యాహూ అన్నారు. నస్రల్లా ప్రాణాలతో ఉన్నంత కాలం తాము ఎంతగా హెజ్బొల్లా నెట్‌వర్క్‌పై దాడులు చేస్తూ వచ్చినా అతడు వాటిని తిరిగి పునరుద్ధరించడాని, ఇప్పుడు అతడి మరణంతో హెజ్బొల్లా నిలబడడం కష్టమేనని నెతన్యాహూ తమ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు. అతడు సృష్టించిన మారణహోమానికి బదులు తీర్చుకొని లెక్క సెటిల్ చేసినట్లు నెతన్యాహు చెప్పారు. గాజాలోని హమాస్‌, లెబనాన్‌లోని హెజ్బొల్లా దాడులతో ఇళ్లు వదిలి నిరాశ్రయులుగా బతుకున్న ఉత్తర ప్రాంత ఇజ్రాయేలీలు నస్రల్లా మరణంతో ధైర్యంగా ఇళ్లకు తిరిగి వస్తారని ఆశించారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ సృష్టించిన మారణ హోమంలో 1400 మందికి పైగా ఇజ్రాయేలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై రగిలిపోయిన ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలో ప్రవేశించి 40 వేల మందికి పైనే పాలస్తీనా ప్రజలను చంపింది. గత వారం నుంచి లెబనాన్‌పై దృష్టి సారించిన ఇజ్రాయెల్ సైన్యం, తూర్పు, దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులు జరుపుతూ మధ్య ప్రాశ్చ్యపు పారిస్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. నస్రల్లా హత్యలో సమర్థంగా పని చేసిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్, సైన్యం- ఐడీఎప్‌, షిన్‌బెట్‌ను నెతన్యాహూ అభినందించారు.


ఇరాన్‌కు నెతన్యాహూ హెచ్చరిక:


ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లో నడిచే హెజ్బొల్లా ఉగ్రమూక నాయకుడు హసన్ నస్రల్లా హత్యను చూపిస్తూ నెతన్యాహూ శత్రుదేశమైన ఇరాన్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఆయుధాలు మధ్యప్రాశ్చ్యంలోని ఇరాన్ సహా ఇతర శత్రుదేశాల్లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించగలవని నెతన్యాహూ అన్నారు. “ఇరాన్‌ సహా ఎక్కడ దాక్కున్నా తమ సైన్యం అక్కడకొచ్చి చంపగలదు. రుజువులు కావాలంటే నస్రుల్లా హతమే అందుకు ఉదాహరణ” అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. మమ్మల్ని దెబ్బకొట్టాలని చూసిన వాళ్లందరినీ చావు దెబ్బకొడతామంటూ అయతొల్లా ఏలుబడిలోని ఇరాన్‌కు నేరుగా హెచ్చరికలు చేశారు. ఇజ్రాయేలీల మనుగడకు ప్రమాదకరంగా పరిణమించే శత్రుదేశాలను దెబ్బకొట్టేందుకు ఇజ్రాయేలీలు  ఐక్యంగా ఉండాలని సూచించారు.


హెజ్బొల్లా అధినేత నస్రల్లా హత్యోదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు రాయిటర్స్ తెలిపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన్ను ఇరాన్‌లోనే ఒక ప్రాంతానికి సైన్యం శనివారం తరలించింది. అటు.. నస్రల్లా హత్యోదంతాన్ని ఇరాన్‌ యూఎన్‌జీఏలో ప్రస్తావనకు తేగా అతడి హత్య సమర్థనీయమేనని అమెరికా తేల్చి చెప్పింది.