NCERT new Class 8 book lists corruption in judiciary: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) విడుదల చేసిన కొత్త క్లాస్ 8 సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై సంచలన అంశాలను చేర్చింది. సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర అనే అధ్యాయంలో మొదటిసారిగా న్యాయవ్యవస్థలో అవినీతి, భారీగా పేరుకుపోయిన కేసులు అనే అంశాలను ప్రధాన సవాళ్లుగా పేర్కొంది. గతంలో కేవలం న్యాయవ్యవస్థ నిర్మాణం, విధులను మాత్రమే వివరించే పాఠ్యపుస్తకం, ఇప్పుడు వ్యవస్థలోని లోపాలను కూడా విద్యార్థులకు పరిచయం చేస్తోంది.
న్యాయవ్యవస్థలో వివిధ స్థాయిలలో ప్రజలు అవినీతిని ఎదుర్కొంటున్నారని, దీనివల్ల పేదలకు, అణగారిన వర్గాలకు న్యాయం అందడం కష్టతరమవుతోందని ఈ పుస్తకం వివరించింది. న్యాయమూర్తులు కోర్టులో , వెలుపల కూడా ఖచ్చితమైన ప్రవర్తనా నియమావళిని పాటించాలని, తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు పార్లమెంటు ద్వారా అభిశంసన తీర్మానం చేపట్టి వారిని తొలగించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, 2017-2021 మధ్య కాలంలో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా సుమారు 1,600 ఫిర్యాదులు అందినట్లు గణాంకాలను వెల్లడించింది.
దేశంలోని కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను కూడా ఈ పాఠ్యపుస్తకం వెల్లడించింది. సుప్రీంకోర్టులో దాదాపు 81,000 కేసులు, హైకోర్టుల్లో 62.40 లక్షల కేసులు, జిల్లా,దిగువ కోర్టుల్లో ఏకంగా 4.70 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొంది. న్యాయమూర్తుల కొరత, సంక్లిష్టమైన చట్టపరమైన విధానాలు ,మౌలిక సదుపాయాల లేమి కారణంగానే ఈ భారీ బ్యాక్లాగ్ ఏర్పడిందని పుస్తకంలో విశ్లేషించారు. న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే వాక్యాన్ని ఇక్కడ ఉదహరించారు.
ఈ పాఠ్యపుస్తకంలోని అంశాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలను తాము అనుమతించబోమని, దీనిపై సుమోటోగా కేసు నమోదు చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రకటించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా విద్యార్థులకు బోధించడం ఆందోళనకరమని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
