Heeraben On Narendra Modi: 


ABP న్యూస్ ఇంటర్వ్యూలో..


నరేంద్ర మోడీ భారత దేశ ప్రధాని అవుతారని ఆయన తల్లి హీరాబెన్ మోడీ ముందుగానే ఊహించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో వరుసగా మూడు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే హీరాబెన్ మోడీ ABP Newsతో మాట్లాడారు. అప్పుడే ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నరేంద్ర మోడీకి ప్రధాని అయ్యే సామర్థ్యం ఉంది. ప్రధాని పదవిని అధిష్ఠించే సమయం వచ్చింది" అని
అన్నారు. ఆమె అన్నట్టుగానే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ అఖండ విజయం సాధించింది. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరవాత 2019లో జరిగిన ఎన్నికల్లోనూ ఓటర్లు బీజేపీకే పట్టం కట్టారు. రెండోసారీ ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడాయన చరిష్మా అంతకు ముందు కన్నా పెరిగింది. మోడీ ప్రధాని అయ్యే ముందు ఎన్నో కీలక పరిణామాలు జరిగాయి. 2012లో గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన  విజయం సాధించింది. అప్పుడే మోడీ పేరు మారుమోగిపోయింది. 2013లో గోవాలో జరిగిన ఓ సమావేశంలో బీజేపీ పెద్దలంతా కలిసి పార్టీని నడిపించే నాయకుడు మోడీనే అని ప్రకటించారు. ఆ తరవాత ఆయన సారథ్యంలోనే బీజేపీ 2014 ఎన్నికల బరిలోకి దిగింది. 282 స్థానాల్లో విజయ పతాకం ఎగరేసింది. పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో నరేంద్రమోడీని ప్రధానిగా ప్రకటించింది బీజేపీ. ఇదంతా జరగకముందే తన కొడుకు కచ్చితంగా దేశ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు హీరాబెన్ మోడీ. అన్నట్టుగానే ఆ పదవిని చేపట్టారు మోడీ. 


మోడీ భావోద్వేగం..


ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ చేసి తెలిపారు. నిండు నూరేళ్ల పాటు ఎంతో గౌరవంగా గడిపిన జీవితం ఆమెది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన  ట్వీట్‌లో తన తల్లి 100వ పుట్టిన రోజు సందర్భంగా తనకు ఏ విషయాలు చెప్పారో తెలిపారు. ఈ ఏడాది జూన్ 18న మోదీ తల్లి హీరాబెన్ 100వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆ సందర్భంగా తనకు తల్లి చెప్పిన మాటలను మోదీ ట్వీట్ చేశారు. ఎల్లప్పుడూ మంచి తెలివితేటలతో, స్వచ్ఛంగా జీవించాలని, తెలివిగా పని చేయాలని తల్లి హీరాబెన్ తనకు చెప్పినట్లుగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. బతికినంత కాలం స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని ఆమె సూచించినట్లుగా మోదీ గుర్తు చేస్తూ భావోద్వేగ ట్వీట్ చేశారు.  ‘‘తన 100వ పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిసినపుడు నాతో ఒక మాట అన్నారు, పని తెలివితేటలతో, స్వచ్ఛతతో జీవించు, ఎప్పుడూ తెలివితో పని చేయండి, స్వచ్ఛతతో కూడిన జీవితాన్ని గడపాలి అని చెప్పారు అది ఎప్పుడూ గుర్తుంటుంది’’ అని ట్వీట్ చేశారు. “నా తల్లి ఈశ్వరుని పాదాలను చేరింది. ఆమె నిస్వార్థ కర్మ యోగికి ప్రతీక. నిబద్ధతతో కూడిన జీవితాన్ని కలిగి ఉన్న త్రిమూర్తుల మాదిరిగా నేను ఎప్పుడూ అనుభూతి చెందుతున్నాను’’ అని మోదీ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.