మంత్రాల చేసి సమస్యలు తీరుస్తానని 11 మంది ప్రాణాలు తీసిన బాబా అసలు స్వరూపం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంగా దందా చేస్తున్న వ్యక్తి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అతన్ని అదుపులోకి తీసుకొని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


రామెట్టి సత్యనారాయణ యాదవ్‌ కొన్నేళ్లుగా తనకు మంత్రాలు వచ్చి సమస్యలకు ఇట్టే పరిష్కారాలు చూపిస్తానంటూ తిరుగుతుండే వాడు. అతన్ని నమ్మిన చాలా మంది ప్రజలకు సమస్యల పరిష్కారం కోసం అతన్ని ఆశ్రయించే వాళ్లు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా వేటినైనా తన మంత్రశక్తితో తీసేస్తానంటూ కబుర్లు చెప్పాడు. గుప్త నిధులు కూడా వెలికి తీస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. 


రామెట్టి సత్యనారాయణ యాదవ్‌ చెప్పే మాటలకు చాలా మంది బుట్టలో పట్టారు. తమ వద్ద ఉన్న ఆస్తులను, బంగారం, నగలు, డబ్బును దారపోశారు. వారి వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకున్న సత్యనారాయణ సమస్యలు మాత్రం పరిష్కరించలేకపోయాడు. ఎన్నిసార్లు తిరుగుతున్నా చెప్పిన మాటలనే చెప్పేవాడు. 


చివరకు భక్తుల్లో కొందరు నిలదీయడం మొదలు పెట్టారు. అంతే తన ప్లాన్ బీని అమలు చేశాడు సత్యనారాయణ. ఎదురు తిరిగే వాళ్లను ఫినిష్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా ఒకరిద్దర్ని కాదు ఏకంగా 11 మంది ప్రాణాలు తీశాడు. వివిధ మార్గాల్లో వారిని హతమార్చి ఏదో కారణంతో చనిపోయారు అని నమ్మించే వాడు. 


ఇన్నాళ్లకు ఈ నరహంతకుడి పాపం పండింది. ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ అయింది. కేసు విచారణలో భాగంగా ఆరా తీస్తే 11 మంది ప్రాణాలను ఈయనే తీశాడని తెలిసి పోలీసులకే వణుకుపుట్టింది. తన భర్త కనిపించడం లేదని రియల్టర్ భార్య హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తీగ లాగితే నాగర్‌కర్నూల్‌లో డొంక కదలింది. సత్యనారాయమ బాగోతం వెలుగు చూసింది.