Mukesh Ambani Z+ Security: 


బెదిరింపులు..


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి Z ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు అనుమతినిస్తుందని సమాచారం. ఈ మధ్య కాలంలో ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇది దృష్టిలో ఉంచుకుని...ఇంటిలిజెన్స్ వర్గాల సూచన మేరకు ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఆయనకు Z కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. గతేడాది ముంబయిలోని ఆయన నివాసం అంటిలీయాకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమ త్తమైన కేంద్రం వెంటనే భద్రత పెంచింది. కేవలం అంబానీ అనే కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్తలందరికీ భద్రత పెంచాలని అప్పుడే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావించింది. ఇండియాలో ప్రముఖ వ్యక్తులకు..వాళ్ల పాపులారిటీ ఆధారంగా ఈ భద్రత అందిస్తారు. అధికారిక భాషలో దీన్ని Security Cover అంటారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం...ఏ కేటగిరీ భద్రత అందించాలో హోం శాఖ నిర్ణయం తీసుకుంటుంది. వారికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షిస్తుంది. ప్రమాదం ఆధారంగా 5 కేటగిరీలుగా భద్రతను విభజిస్తారు. X,Y,Z,Z+,SPG సెక్యూరిటీ కవర్‌లు అందుబాటులో ఉంటాయి. వీఐపీలు, వీవీఐపీలు, ప్రముఖ వ్యక్తులు, క్రీడాకారులు, పొలిటికల్ పాపులారిటీ ఉన్న వాళ్లకు ఈ సెక్యూరిటీ అందిస్తారు. ఇందులో Z ప్లస్ కేటగిరీ టాప్‌లో ఉంటుంది. 55 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తారు. వీరిలో 10 మందికిపైగా NSG కమాండోలు, పోలీసులు ఉంటారు. ప్రతి కమాండో మార్షియల్ ఆర్ట్స్‌లో ఆరితేరి ఉంటారు. ఇప్పటి వరకూ భారత్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు Z ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ముకేశ్ అంబానీ కూడా చేరనున్నారని
తెలుస్తోంది. 


గతంలోనూ బెదిరింపు కాల్స్..


ముకేశ్ అంబానీకి చాలా సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న హర్‌కిసాన్‌దాస్‌ ఆసుపత్రికి ఫోన్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు. నిందితుడు ఒకే నంబరు నుంచి మూడు, నాలుగు కాల్స్‌ చేసినట్లు సమాచారం. ఆసుపత్రి యాజమాన్యం 
ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ముంబయిలోని డీడీ మార్గ్‌ పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఫోన్‌ నంబరు ఆధారంగా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమికంగా వెల్లడించారు. ఆసుపత్రి ఫోన్ నెంబర్ ను గూగుల్‌లో సెర్చ్ చేసి ఫోన్‌ చేశాడా నిందితుడు. గతేడాది ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. మొదట ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజేనే ఘటనకు ప్రధాన సూత్రధారిగా తేలింది. అప్పట్లో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. నాటి నుంచీ ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది. 


Also Read: Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!