Mohan Charan Majhi Takes Oath As Odisha CM: ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు పాతికేళ్లుగా అక్కడ బిజూ జనతా దళ్‌దే రాజ్యం. ఆ పార్టీ కంచుకోటను తొలిసారిగా బీజేపీ బద్దలు కొట్టింది. బీజేపీ నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఇదే తొలిసారి. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. కనక్ వర్దన్ సింగ్ దియో డిప్యుటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. 





మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా వచ్చారు. అంతకు ముందు స్వయంగా మోహన్ చరణ్ నవీన్ పట్నాయక్ ఇంటికి వెళ్లి ఆహ్వానం అందించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని భువనేశ్వర్‌లోని అన్ని ఆఫీస్‌లను మధ్యాహ్నం 1 గంట తరవాత మూసేశారు. ఈ వేడుక కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 67 పోలీసు దళాలు మొహరించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 147 సీట్లకు గానూ బీజేపీ 78 చోట్ల విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 30 వేల మంది హాజరైనట్టు అంచనా.