Congress MLA Seethakka:


అక్రమార్కులను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.  12వ తేదీన (మంగళవారం రోజున) కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వరంగల్ బందుకు పిలుపునిచ్చారు. ఈ బందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో విద్యార్థులతో ఎమ్మెల్యే సీతక్క కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి సంఘాల జేఏసీ నేతల దీక్షకు ఆమె మద్దతు తెలిపారు.


ఈ సందర్భంగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. ఉద్యమాల, పోరాటాల గడ్డ అయిన వరంగల్ కు తలమానికం కాకతీయ యూనివర్సిటీ అని తెలిపారు. ఈ స్ఫూర్తిని నింపుకున్న ఎందరినో కాకతీయ యూనివర్సిటీ దేశానికి అందించిందని గుర్తు చేశారు. యూనివర్సిటీలో బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. విద్యార్థుల పక్షాన తాను నిలబడతానని, వారికి మద్దతు తెలుపుతున్నట్లు వ్యాఖ్యానించారు.


తాను కూడా కేయూ అధికారుల బాధితురాలిని అని సీతక్క వెల్లడించారు. సరైన అర్హత ఉన్న తనకు పీహెచ్డీ అడ్మిషన్ (Phd Admission) ఇవ్వలేదని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్ష రాసి జాయిన్ అయ్యానని తెలిపారు.. విద్యార్థులను వేధిస్తే వారు తిరగబడి తరిమి కొడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. విద్యార్థులపై పైశాచిక దాడిని ఖండిస్తున్నానని వెల్లడించారు. వీసీ, రిజిస్టర్ లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల వరంగల్ బందుకు కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ ఉంటుందని ఎమ్మెల్యే సీతక్క ప్రకటించారు.


రాష్ట్రంలో విద్య వ్యవస్థ పక్కదారి.... 


రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పక్కదారి పడుతోందని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. మెరిట్ ప్రకారం అడ్మిషన్లు ఇవ్వాలని అడిగితే సీట్లు ఇవ్వట్లేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు కావాలంటే బల్రు, గొర్లు తీసుకోనని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న పోలీసులు విద్యార్థుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. స్టూడెంట్స్ లను గుండాలుగా చిత్రీకరించొద్దని కోరారు. విద్యార్థుల చేతులు, కాళ్లు విరగ్గొట్టారని, చదువుకునే విద్యార్థులపై ఇలా ప్రవర్తించడం ఇదెక్కడి న్యాయమో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యపై దృష్టి సారించాలని కోరారు. ఇలా విద్యార్థులు చదువు మానేసి ప్రభుత్వంపై తిరగబడడం మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పిహెచ్డి అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించినందుకే విద్యార్థులపై కేసులు పెట్టించి పోలీసులచే దాడి చేయించిన బాధ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.


విద్యార్థి సంఘం నాయకులపై దాడి చేసిన పోలీసు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పారు. దాడిలో గాయపడిన విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని లేదంటే దీక్షలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఇంత జరుగుతున్న ప్రభుత్వం గానీ, మంత్రులు గాని కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.