Ambati Rambabu Comments: రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సాధారణమే. కొంత మంది శ్రుతి మించి కూడా కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఏపీ నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు కాస్త డోసు పెంచి మరీ విమర్శలు ఎక్కుపెట్టారు. గత కొద్ది రోజులుగా వివిధ అంశాలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తున్న తీరు చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. మంగళవారం (సెప్టెంబరు 27) రాత్రి కూడా ఆయన చేసిన ఓ ట్వీట్ చాలా ఘాటుగా ఉంది. అమరావతి రైతులను ఉద్దేశించి ఆయన ఆ ట్వీట్ చేసినట్లుగా అర్థం అవుతోంది.


మంగళవారం రాత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌లో పాదయాత్ర చేస్తున్న వారిని ఒళ్లు బలిసినవాళ్ల పాదయాత్రగా అభివర్ణించారు. ఆ విషయం ఇంతకుముందు అన్నానని, ఇకపై అంటానని, మళ్లీ మళ్లీ కూడా అంటానని అదే ట్వీట్‌లో చెప్పారు.


‘‘అన్నాను...అంటాను... మళ్ళీ మళ్ళీ అంటాను... అది వొళ్ళుబలిసినోళ్ల పాదయాత్ర !’’ అని అంబటి రాంబాబు మంగళవారం (సెప్టెంబరు 27) రాత్రి ట్వీట్ చేశారు. అంతకుముందు అదే రోజు ఉదయం కృష్ణా జిల్లా కోడూరులో ఆయన పర్యటించారు. అక్కడ మూడో విడత వైఎస్సార్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.






ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికే సీఎం జగన్‌ మూడు రాజధానులను కొనసాగించాలని చూస్తున్నారని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ చేస్తున్న పాదయాత్ర ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదని అన్నారు. తన పార్టీపై నమ్మకం లేక మిగిలిన పార్టీలతో కలిసి వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీని కాపాడేందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టారని, అలాంటి వారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌, బాలకృష్ణ ఇలా.. ఎంత మంది కలిసి పోటీ చేసినా సరే, ఈ సారీ జగన్మోహన్‌ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని అంబటి రాంబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.


ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తొలగించడంపైనా తీవ్రంగానే


ఇటీవల వివాదం అయిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై టీడీపీ నేతలు చేసిన విమర్శలను ఇదే స్థాయిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా బాలక్రిష్ణ స్పందనపై వరుసగా ట్వీట్లు చేశారు. ‘‘జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..!’’, ‘‘కష్టంలో తండ్రిపై  ప్రేమ చూపని బాలయ్యా ! నీకు సిగ్గులేదయ్యా! ‘‘బాబుకి బుద్ధి లేదు 
బాలయ్యకి సిగ్గు లేదు, లోకేష్ కి బుర్రే లేదు’’ అని కొద్ది రోజులుగా వరుసగా ట్వీట్లు చేశారు.


17వ రోజుకు పాదయాత్ర
రాజధాని కోసం అమరావతి నుంచి అరసపల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాద యాత్ర 17వ రోజు ఏలూరు సమీపంలోని కొత్తూరు నుంచి ప్రారంభమైంది. నిన్న యాత్రకు విరామం ఇచ్చిన రైతులు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఏలూరు నుంచి కొవ్వలి వరకు 14 కిలో మీటర్లు సాగనుంది.


పాదయాత్రకు బాపట్ల జిల్లా చందలూరు రైతులు, మహిళలు, టీడీపీ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి మాట్లాడుతూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు పాదయాత్ర లో పాల్గొంటు న్న మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం శోచనీయమని పేర్కొన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఎన్ని నిర్భందాలు పెట్టినా యాత్ర ప్రజల మద్ధతుతో దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు. అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.