Minister Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు సరికాదని అన్నారు. పవన్ కల్యాణ్ కు సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు ఉందని.. కానీ రాజకీయాల్లో కూడా హీరోగా మారాలనుకుంటే అది కుదరదని చెప్పారు. సినిమాల్లో హీరోగా ఉండి రాజకీయాల్లో హీరో అవుతారని నిరూపించిన వ్యక్తి కేవలం ఒక ఎన్టీఆర్ మాత్రేనని గుర్తు చేశారు. ఆయన స్థాయికి పవన్ కల్యాణ్ చేరుకోలేరని.. జనసేనాని రాజకీయాల్లో కేవలం కమెడియన్ గా మాత్రమే మిగిలిపోతారంటూ విమర్శించారు. వైసీపీని ప్రశ్నించడానికి మాత్రమే పుట్టి పార్టీ జనసేన అని అన్నారు. పవన్ కల్యాణ్ ధ్యేయం ముఖ్యమంత్రి కావడమా లేక అసెంబ్లీలో అడుగు పెట్టడమా అని ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేస్తారా లేదా అనేది పవన్ స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. 


స్థిరత్వం లేని పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రారని.. పొలిటికల్ కెరియర్ ను ఎక్కువ కాలం సాగించలేరని అన్నారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు నడిపిస్తున్నారని అంబటి ఆరోపించారు. రాజకీయాల్లో హీరోను కాలేనంటూ పవన్ కల్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే తాము నాలుగు చెప్పులు చూపిస్తామని హెచ్చరించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులతో పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది మాత్రం వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే ప్రవాహాన్ని నియంత్రించే కట్ట గైడ్ బండ్ కుంగిందని.. గైడ్ బండ్ కుంగిన విషయాన్ని దాయాల్సిన అవసరం లేదన్నారు. సాంకేతిక కారణాలపై అధ్యయనం చేస్తామన్నారు. 41.15 కాంటూరు లెవెల్ కు భూమి సేకరణ, పునరావాసం కల్పిస్తామన్నారు. రెండో దశలో 45.72 కాంటూరు లెవెల్ పూర్తి చేస్తామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.


 ఇటీవలే మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు. ఆయనను కాపులు మితిమీరి అతిగా అభిమానిస్తున్నారని చెప్పుకొచ్చారు  మితి మీరిన అభిమానం కాపు సమాజానికి కీడు చేస్తోదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం పెట్టాడానికి సామాజిక వర్గం సిద్దంగా ఉంటే ఆ సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు అమ్మడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారన్నారు.  పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని  కాపులు కలలు కంటున్నారని తెలిపారు.. వచ్చే ఎన్నికల తర్వాత పవన్ సీయం అవుతాడని పిచ్చి అభిమానంతో, అర్థం లేని లాజిక్ లతో పవన్ కోసం కమ్యూనిటీ అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు.. కానీ పవన్ మైడ్ సెట్‌ మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉందనీ తేల్చారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం కల్లా అని స్పష్టం చేశారు.. తనను పూర్తిగా నమ్మి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజిక వర్గం చేత  బాబును కూర్చునే  పల్లకిని  మోయిస్తాడు పవన్  అని అన్నారు అంబటి.. పవన్ కళ్యాణ్ ను నమ్మి  ఆయన వెన్నంటి ఉన్న జనసేన కార్యకర్తలు వీర మహిళలు పూర్తిగా నష్టపోతారని జోస్యం చెప్పారు.