Millets Food: 


30% మేర మిలెట్స్ 


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర సాయుధ బలగాలతో పాటు NDRF సిబ్బందికి అందించే భోజనంలో తృణధాన్యాలను చేర్చనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన  చేసింది. ఈ సిబ్బంది తీసుకునే ఆహారంలో 30% మేర తృణ ధాన్యాల వంటకాలు ఉండేలా చూడనుంది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 


"సీఏపీఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ మీల్స్‌లో 30% మేర తృణధాన్యాలు ఉండేలా చూడాలని కేంద్రమంత్రి అమిత్‌షా సూచించారు. ఆ సూచన మేరకు ఇకపై ఈ నిర్ణయం అమలవుతుంది"


- కేంద్రహోం శాఖ 










సూపర్ ఫుడ్..


ఇప్పటికే తృణ ధాన్యాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. వీటి ప్రాధాన్యత అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ వీటికి తగిన ప్రాధాన్యతనిచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా తృణ ధాన్యాలకు ప్రయారిటీ ఇచ్చింది. ఈ మేరకు 2023-24ని అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా ( International Year of Millets) ప్రకటించింది. ఈ ధాన్యాల్లో ప్రోటీన్‌లు, కార్బొహైడ్రేట్‌లు, ఫైబర్ అత్యధికంగా ఉంటాయి. అందుకే వీటిని సూపర్ గ్రెయిన్ (Super Grain) అని పిలుస్తారు. ఈ ఏడాది మార్చి నెలలోనే ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. రోజువారీ మీల్స్‌లో మిలెట్స్‌ని చేర్చనున్నట్టు వెల్లడించింది. సైనికులకు నెలవారీ ఇచ్చే రేషన్‌లోనూ మిలెట్స్‌ను చేర్చనున్నారు. సైనికులకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. 


"ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2023ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ సందర్భంగా...ఆర్మీకి అందించే మీల్స్‌లో మిలెట్స్‌ను చేర్చుతున్నాం. మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన తృణధాన్యాలను వాళ్లకు అందించాలన్నదే మా లక్ష్యం. ఆరోగ్య పరంగా కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. అందుకే అన్ని ర్యాంకుల అధికారుల మీల్స్‌లో వీటిని చేర్చాం"


- ఇండియన్ ఆర్మీ


ఆరోగ్యకరం..


భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని అందించే పంటలపై ఆసక్తి పెరిగింది. రాగులు, సజ్జలు, అరికెలు, ఊదల వంటి తృణధాన్యాలు తిన్న తర్వాత మెల్లగా గ్లూకోస్‌ను విడుదల చేసే సంగతి తెలిసిందే. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతున్నాయి. డయాబెటిస్‌ ముప్పు తగ్గుతోంది. భారతీయుల ఆరోగ్యంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌కు అవకాశం దొరికింది. అందుకే ఐక్య రాజ్య సమితితో ఈ ఏడాదిని 'తృణధాన్యాల సంవత్సరం'గా ప్రకటించేలా పావులు కదిపారు. టాటా కన్జూమర్స్‌, ఐటీసీ వంటి బ్రాండ్లు తృణధాన్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. తృణధాన్యాలతో ఇడ్డీరవ్వ, ఉప్మా రవ్వా, దోసె పిండి, బిస్కెట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. పైగా ఐటీసీ తమ హోటళ్లలో తృణధాన్యాల భోజనాలను ప్రవేశపెట్టబోతోందని తెలిసింది.


Also Read: Karnataka Muslim Quota: హిందూ ముస్లింలు బానే ఉన్నారు, అనవసరంగా చిచ్చుపెట్టకండి - అమిత్‌షాపై స్టాలిన్ ఫైర్