Viral Video: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బస్‌ కండక్టర్‌పై ఇద్దరు యువకులు దాడి చేశారు. బస్‌లో ఉండగానే ఉన్నట్టుండి దాడికి దిగారు. బస్‌లో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బస్‌లో ఉన్న సీసీకెమరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బస్ ఎక్కిన ఇద్దరు యువకులు ఏమీ కారణం లేకుండానే గొడవ పడ్డారు. ఎందుకిలా చేస్తున్నారని మందలించినందుకు కండక్టర్‌పై దాడి చేశారు. జులై 10వ తేదీన ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ముందు డ్రైవర్‌ని కొట్టిన దుండగులు ఆ తరవాత కండక్టర్‌పైనా చేయి చేసుకున్నారు. కానీ కండక్టర్ వెనక్కి తగ్గలేదు. ఎదురు దాడికి దిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 




ఈ వీడియో చూసిన నెటిజన్‌లు కండక్టర్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఇద్దరు యువకులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏ కారణమూ లేకుండా ఎందుకు దాడి చేశారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. బస్ కదులుతుండగా ఈ ఘటన జరిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు ఫుల్లుగా తాగి ఈ గొడవ చేశారనీ కామెంట్స్ పెడుతున్నారు. అధికారులు వీలైనంత త్వరగా స్పందించి వాళ్లను కఠినంగా శిక్షించాలని అడుగుతున్నారు.