Mamata Banerjee Taunts BJP: 


బీజేపీపై ఫైర్ అయిన దీదీ 


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఫైర్ అయ్యారు. దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ బెదిరిస్తున్నారని మండి పడ్డారు. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి జాతీయ పార్టీ హోదాను తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలోనే ఆమె కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలూ ఊరికే కూర్చున్నాయని అనుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. మౌనంగా ఉన్నంత మాత్రాన తక్కువ అంచనా వేయొద్దని స్పష్టం చేశారు. 


"కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది. ప్రతిపక్షాలు సైలెంట్‌గా కూర్చున్నాయని పొరపడకండి. మా ఉనికి మేం చాటుకుంటాం. ప్రతి పార్టీ మరో పార్టీతో టచ్‌లోనే ఉంది. సరైన సమయంలో అంతా ఒక్కటై సుడిగాలిలా వస్తాం. మా పార్టీకి జాతీయ హోదా తొలగించారు. ఈ హోదాను మళ్లీ ఇవ్వాలని నేను అమిత్‌షాకు కాల్ చేశానంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిజం చేస్తే నేను రాజీనామా చేస్తాను" 


- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం


తృణమూల్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు దీదీ. కేంద్ర బలగాలను అడ్డం పెట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. జైల్లో పెట్టినంత మాత్రాన ప్రజల కోసం చేయాల్సిన మంచి పనులను ఆపేదే లేదని స్పష్టం చేశారు. 


"బీజేపీ వాళ్లు నా గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నాపై ఎన్నో నిందలు వేస్తున్నారు. మా ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించాలనే కుట్ర చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ దాడులతో మమ్మల్ని బెదిరిస్తున్నారు. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ కూడా ఈ కుట్రలో పాలు పంచుకుంటున్నాయి. మమ్మల్ని జైల్లో పెట్టి ఎన్నికలు గెలవాలనే భ్రమలో ఉండకండి"


- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం


కొవిడ్ కేసులు పెరుగుతుండటాన్ని ప్రస్తావించారు మమతా. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు. వేడిగాలులు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయని, ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇక సుప్రీంకోర్టులో స్వలింగ వివాహాల పిటిషన్‌లపై విచారణ జరుగుతుండటంపైనా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు మమతా బెనర్జీ. 


"నేనీ అంశంపై ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఇది న్యాయవ్యవస్థ పరిధిలోని అంశం. ఎదుటి వాళ్లను ప్రేమించే వాళ్లంటే నాకెప్పుడూ అభిమానమే. ఇది చాలా సున్నితమైన విషయం. ప్రజల అభిప్రాయాలేంటో గమనించాలి. ఈ విషయంలో కోర్టు ఏం చెబుతుందో చూడాలి. ఆ తరవాతే మా అభిప్రాయమేంటో చెబుతాం"


- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్ ను జాతీయ హోదా పార్టీకి గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో మూడు జాతీయ హోదా పార్టీలకు ఈసీ షాకిచ్చింది. సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ పార్టీలు జాతీయ పార్టీ హోదా కోల్పోయినట్లు తెలిపింది.