Uddhav Thackeray vs Shinde:


ఇది అన్యాయం: థాక్రే వర్గం


శివసేన 'విల్లు, బాణం' గుర్తుపై శిందే, ఠాక్రే వర్గం మధ్య కొనసాగుతున్న వివాదంలో భారత ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంధేరి తూర్పు స్థానానికి జరిగే ఉపఎన్నికలో శివసేనకు రిజర్వ్ చేసిన 'విల్లు, బాణం' చిహ్నాన్ని ఉపయోగించడానికి రెండు వర్గాలను అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. అంధేరిలో ఈస్ట్‌ సీటుకు జరిగే ఉపఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫై చేసిన ఉచిత చిహ్నాల జాబితా నుంచి వేర్వేరు చిహ్నాలను ఎంచుకోవాలని రెండు వర్గాలను కోరినట్లు కమిషన్ తెలిపింది. అక్టోబర్ 10న మధ్యాహ్నం 1 గంటలకు రెండు గ్రూపులు స్పందించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఇదో సంచలనమైంది. శిందే, ఉద్దవ్ గ్రూప్‌ల మధ్య చాన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం..ఇంకా ముదిరే అవకాశాలే కనిపిస్తున్నాయి. అటు ఠాక్రే క్యాంప్ ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఇది "అన్యాయం" అని చాలా గట్టిగానే నినదిస్తోంది. అటు శిందే వర్గం మాత్రం ఇది సరైన నిర్ణయమే అని సమర్థిస్తోంది. ఠాక్రే సన్నిహితులు, విధేయులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. "ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకుండా ఏదో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఉండాల్సింది" అని అభిప్రాయపడుతున్నారు. ఉద్దవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా ఈసీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "డబ్బు కట్టలకు ఆశపడి శిందే నమ్మకద్రోహం చేశారు. ఇప్పుడు మా పార్టీ గుర్తు కూడా మాకు ఉండకుండా కుట్రలు చేస్తున్నారు" అని ట్వీట్ చేశారు. "మేం పోరాటం కొనసాగిస్తాం. గెలిచి తీరతాం. నిజం మావైపే ఉంది. సత్యమేవ జయతే" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారిపోయాక...తొలిసారి ఠాక్రే, శిందే మధ్య ఎన్నికల పోటీ జరగనుంది. నవంబర్ 3న అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. చూడటానికి ఇది ఉపఎన్నికలాగే కనిపించినా...ఇది ఉద్దవ్ ఠాక్రే, భాజపా మధ్య ఫైట్‌గా మారనుంది. 






ఎవరి వాదన వారిది..


తమకు మెజారిటీ శివసేన సభ్యుల మద్దతు ఉందని పేర్కొంది శిందే శిబిరం. ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు మెజారిటీ మద్దతు లేదని పేర్కొంది. దీనిపై ఆ పార్టీ ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని ఆరోపిస్తోంది. శివసేనలో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి అసలు సిసలైన శివసేన గురించి వివాదం నడుస్తోంది. ఏక్నాథ్ శిందే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు తమను తాము నిజమైన శివసేన అని పిలుచు కుంటున్నాయి. ఈ పరిస్థితిలో ఎన్నికల సంఘం విచారణ చాలా ముఖ్యమైంది. ఏ వర్గానికి 'విల్లు, బాణం' గుర్తు పొందాలో నిర్ణయించాల్సి వస్తోంది. అలా కేటాయించిన పార్టీయే నిజమైన శివసేనగా మారనుంది. అందుకే ఈ గుర్తు కోసం రెండు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో థాకరే వర్గీయులు విల్లు, బాణం గుర్తు ఉపయోగించకుండా చేసేందుకు శిందే వర్గీయులు గట్టిగానే ప్రయత్నించింది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంది. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. అంధేరి ఉపఎన్నికల్లో గుర్తు వాడకాన్ని నిషేధం మాత్రం ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు పెద్ద ఎదురుదెబ్బగానే మారనుంది. 


 Also Read: ABP C-Voter Survey: కాంగ్రెస్ అధ్యక్షుడెవరు? సర్వేలో ప్రజల షాకింగ్ రియాక్షన్‌