Lok Sabha Elections Phase 6 2024 Updates: వెస్ట్‌బెంగాల్‌లో ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. గతంలో ఐదో విడతలో జరిగిన పోలింగ్ సమయంలోనూ దాడులు, కొట్లాటలు జరగ్గా ఇప్పుడు ఏకంగా బీజేపీ అభ్యర్థిపైనే దాడి జరిగింది. కొంత మంది ఆందోళనకారులు బీజేపీ ఎంపీ అభ్యర్థిని రాళ్లతో తరిమి తరిమి కొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళపొట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. అభ్యర్థిని కాపాడేందుకు షీల్డ్‌లతో ముందే నిలబడ్డాయి. బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై (Pranat Tudu) ఈ దాడి జరిగింది. ఒక్కసారిగా రాళ్లు రువ్వడం వల్ల సెక్యూరిటీతో పాటు ఎంపీ అభ్యర్థి కూడా పరుగులు పెట్టాల్సి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే ఈ పని చేశారని ప్రణత్ తుడు ఆరోపించారు. తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి ఈ దాడిలో గాయాలయ్యాయని, ప్రస్తుతం వాళ్లని హాస్పిటల్‌లో చేర్చామని చెప్పారు.






అయితే...అటు ఆందోళనకారుల వాదన మరోలా ఉంది. ఓటు వేయడానికి లైన్‌లో నిలబడ్డ ఓ మహిళని ప్రణత్ తుడు సెక్యూరిటీ సిబ్బంది వేధించారని, అనుచితంగా ప్రవర్తించారని చెబుతున్నారు. అందుకే ఇలా దాడి చేశామని అంటున్నారు. అయితే...బీజేపీ బెంగాల్‌ కో ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. త్వరలోనే బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీని గద్దె దించుతారని తేల్చి చెప్పారు. ప్రణత్ తుడు చెప్పిన వివరాల ప్రకారం కొంత మంది ఆందోళనకారులు ఇటుకలు విసిరారు. పార్టీ ఏజెంట్‌లను పోలింగ్ బూత్‌లలోకి అడుగు పెట్టనివ్వడం లేదని తెలిసి స్వయంగా ఆయనే వచ్చారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా అందరూ కలిసి దాడి చేశారు. ఎంపీ అభ్యర్థి కార్‌పై ఇటుకలు విసిరారు. అటు TMC మాత్రం ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి జోక్యం లేదని, మహిళతో అనుచితంగా ప్రవర్తించినందుకు గ్రామస్థులే ఇలా తిరగబడ్డారని స్పష్టం చేస్తోంది. 


 






Also Read: Elon Musk Affairs: గూగుల్ కోఫౌండర్‌ భార్యతో మస్క్‌కి అఫైర్‌, ఓ పార్టీలో పరిచయమై దగ్గరైన ఇద్దరు - రిపోర్ట్