Actors in Lok Sabha Elections: ఈ సారి లోక్‌సభ ఎన్నికల సినీ తారల ఎంట్రీతో  (Actors in Lok Sabha Elections 2024) మరింత ఆసక్తికరంగా మారాయి. వాళ్లకున్న పాపులారిటీని, ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చాయి. వాళ్లు గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఆయా పార్టీలకు వాళ్లే ప్రచార తారలు కానున్నారు. ఎంతో కొంత ఓటు బ్యాంక్‌నైతే సాధించగలరన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి పార్టీలు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కి (Kangana Ranaut) ఇటీవల బీజేపీ ఎంపీ టికెట్ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నారు. కంగనా పొలిటికల్ ఎంట్రీపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు బీజేపీ టికెట్‌తో తొలిసారి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.


కంగనాతో పాటు మరి కొందరు బాలీవుడ్‌ నటులు ఈసారి ఎలక్షన్ రేసులో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హాకి ఎంపీ టికెట్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం (Bollywood Actors in Lok Sabha Elections 2024) నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఇదే నియోజవర్గం నుంచి భోజ్‌పురి నటుడు పవన్‌ సింగ్‌కి టికెట్‌ కేటాయించింది బీజేపీ. ముందు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన ఆయన...ఆ తరవాత పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అన్నింటి కన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే...1987లో చరిత్ర సృష్టించిన రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రలో నటించిన అఱుణ్ గోవిల్ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. యూపీలోని మీరట్ నుంచి బీజేపీ ఆయనకు టికెట్ కేటాయించింది. ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రచారానికీ సిద్ధమవుతున్నారు. 


నటి హేమ మాలినికి మరోసారి ఎంపీ టికెట్‌ ఇచ్చింది బీజేపీ. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. మధుర నుంచి ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి గెలిచిన ఆమె ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. మధుర నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడానికే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు హేమ మాలిని. బాలీవుడ్ నటుడు రవి కిషన్‌ ఎప్పటి నుంచో బీజేపీతోనే ప్రయాణిస్తున్నారు. రేసుగుర్రం సినిమాతో తెలుగు వాళ్లకీ దగ్గరైన రవి కిషన్ 2019లో యూపీలోని గోరఖ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి కూడా అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.


మరో నటుడు మనోజ్ తివారి నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మూడోసారి బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. మలయాళ సీనియర్ నటుడు సురేశ్ గోపి బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. కేరళలోని త్రిసూర్‌ నుంచి పోటీ చేసేందుకు ఆయనకు హైకమాండ్ టికెట్ కేటాయించింది. బాలీవుడ్ నటి నేహా శర్మకి బిహార్‌లోని భగల్‌పూర్ నుంచి కాంగ్రెస్ తరపున టికెట్ దక్కే అవకాశాలున్నాయి. ఆమె తండ్రి అజిత్ శర్మ ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు గోవింద రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ శిందే శివసేన పార్టీలో ఇటీవల చేరారు. అంతకు ముందు విరార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే...ఆ తరవాత 14 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరంగా మారింది.