Lalu Prasad eldest son Tej Pratap :  లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆయనంతే అదో టైపు వ్యవహారాలతో వివాదాస్పదంగా మారాడు. ఆయనను తాజాగా లాలూ యాదవ్ తన కుటుంబం నుంచి బహిష్కరించారు. పార్టీతో కూడా సంబంధం లేదన్నారు. దీనికి కారణం  తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో అనుష్కా యాదవ్ అనే మహిళతో 12 సంవత్సరాలుగా  సహజీవనంలో  ఉన్నట్లు పోస్ట్ చేశారు.  ఆయన 2018లో ఐశ్వర్య రాయ్‌ అనే రాజకీయ నాయకురాలి కుమార్తెను వివాహం చేసుకున్నారు. వారు విడిపోయారు కానీ.. వారి విడాకుల కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ వ్యవహారం వివాదాస్పదం అయింది. 
 
తేజ్ ప్రతాప్ ఆ పోస్ట్‌ను తొలగించి, తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని చెప్పారు కానీ ఎవరూ నమ్మలేదు.  ఈ వ్యవహారం  RJDలో ,లాలూ కుటుంబంలో  కలకలం రేపింది.  లాలూ ప్రసాద్ యాదవ్ తేజ్ ప్రతాప్‌ను RJD నుండి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించారు .  కుటుంబం నుండి కూడా తొలగించారు. నైతిక  విలువలను విస్మరించడం సామాజిక న్యాయం కోసం మా సామూహిక పోరాటాన్ని బలహీనపరుస్తుందని లాలూ అన్నారు.   పెద్ద కుమారుడి చర్యలు, బహిరంగ ప్రవర్తన,  బాధ్యతారహిత వైఖరి మా కుటుంబ విలువలు మరియు సంప్రదాయాలకు సరిపోలవని లలూ స్పష్టం చేశారు.   బిహార్ శాసనసభ ఎన్నికలకు ముందు  తేజ్  ప్రతాప్ పార్టీని ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారు.  





 


తేజ్ ప్రతాప్ 2018లో  మాజీ బిహార్ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ,  మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యారాయ్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన కొద్ది నెలల్లోనే  తేజ్ ప్రతాప్ విడాకుల కోసం పాట్నా సివిల్ కోర్టులో దరఖాస్తు చేశారు,  తేజ్ ప్రతాప్ మాదక ద్రవ్యాలు వాడతాడని, రాధా-కృష్ణుడు, శివుడిలా వేషం వేసి హింసిస్తాడని ఫిర్యాదు చేసింది. తర్వాత చంద్రికా రాయ్ RJDని వీడి, జనతా దళ్ (యునైటెడ్)లో చేరారు, ఇది RJDకి రాజకీయ నష్టాన్ని కలిగించింది. ఐశ్వర్య ఆరోపణలు తేజ్ ప్రతాప్ ఇమేజ్ ను విచిత్రంగా మార్చాయి. 


అంతటితో ఆయన లీలలు ఆగిపోలేదు..పార్టీలో ప్రాధాన్యం లేదని  2019 లోక్‌సభ ఎన్నికల ముందు, తేజ్ ప్రతాప్ RJD నుండి బయటకు వచ్చి, తన తల్లిదండ్రుల పేరుతో "లాలూ-రబ్రీ మోర్చా" అనే సంస్థను స్థాపించారు. తన మాజీ అత్త   చంద్రికా రాయ్‌ను సారన్ నియోజకవర్గం నుండి  లాలూ ప్రసాద్ టిక్కెట్ ఇవ్వడంతో ఈ పని చేశాడు. 


 తేజ్ ప్రతాప్ తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో పార్టీలో ఆధిపత్యం కోసం పోటీపడ్డాడు. తేజస్వీ RJD  భవిష్యత్తు నాయకుడిగా ఎదిగినప్పుడు, తేజ్ ప్రతాప్ తన స్థానం గురించి అసంతృప్తితో పిచ్చి పనులు చేశాడు.  హోలీ వేడుకల సందర్భంగా, తేజ్ ప్రతాప్ తన అధికారిక నివాసంలో భద్రతా సిబ్బంది కానిస్టేబుల్ దీపక్ కుమార్‌ను పాటకు నృత్యం చేయమని, లేకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించిన వీడియో వైరల్ అయింది.   2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తేజ్ ప్రతాప్  క్క భద్రతా సిబ్బంది ఒక వీడియో జర్నలిస్టుపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.    తేజ్ ప్రతాప్ కృష్ణ భక్తుడిగా ప్రసిద్ధి చెందాడు, తరచూ ఆయన కృష్ణుడిలా వేషం వేసి చాలా సార్లు కనిపించారు.  తనను తాను కృష్ణుడితో, తేజస్వీని అర్జునుడితో పోల్చుకున్నాడు. ఆయన "ధర్మనిర్పేక్ష సేవక్ సంఘ్" (DSS) అనే సంస్థను స్థాపించాడు, కానీ ఇది రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేదు.  "L-R వ్లాగ్" అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడపుతున్నాడు.  ఈ ఛానెల్‌లో ఆయన తన రోజువారీ జీవితం , ప్రయాణాల గురించి వీడియోలు పోస్ట్ చేస్తాడు.