Konaseema News: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. భార్యను అనారోగ్య సమస్యలు వేధించగా.. అది భరించలేని ఆమె ఉరి వేసుకొని చనిపోయింది. భార్య చనిపోయిన విషయం గుర్తించిన భర్త అది తట్టుకోలేక భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు దంపతులు ఇద్దరూ చనిపోవడం జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


అమలాపురం కొంకాపల్లికి చెందిన 47 ఏళ్ల బోనం విజయ్‌ కుమార్‌ స్థానికంగా హిమ్మత్‌ సాఫ్ట్ డ్రింక్‌ తయారీ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. చాలా ఏళ్ల నుంచి అమలాపురంలో మంచి వ్యాపార కుటుంబంగా వీరికి పేరుంది. విజయ్‌ కుమార్‌ భార్యకు మెదడుకు సంబందించి ఇటీవలే శస్త్ర చికిత్స జరిగింది. అయినా ఆమె ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుటపడటం లేదు. దీని గురించి ఆమె ఎప్పుడూ మదన పడుతూనే ఉండేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి విజయ్‌ కుమార్‌ భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భార్య మృతితో విజయ్‌ కుమార్‌ కూడా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆమె లేని లోకంలో తాను ఉండలేని భావించాడు. 


గుండెపగిలే బాధలోనే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే వారు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. దీంతో విజయ్‌ కుమార్‌ కూడా మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


వ్యాపారంలోనూ నష్టాలు..


ఒకప్పుడు అమలాపురంలో ఫేమస్‌ అయిన హిమ్మత్‌ కూల్‌ డ్రింక్‌ తయారీ కొంకాపల్లిలో ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించారు. కాలక్రమంలో ఇది కాస్త మూతపడే పరిస్థితి తలెత్తింది. అమలాపురంలో గ్రీన్‌ లాండ్‌ పేరుతో మొదటి త్రీష్టార్‌ హోటల్‌ నిర్వహించారు. అయితే అదికూడా నష్టాల్లోకి వెళ్లడంతో దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంత కాలంగా చిన్న చిన్న కాంట్రాక్టులు చేపడుతున్నప్పటికీ అవికూడా సంతృప్తికరంగా లేవని తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు చాలవన్నట్లు అనారోగ్య సమస్యలు కూడా వేధించడంతో బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది. 


ఇంట్లో పెళ్లి ప్రస్తావన - యువకుడి ఆత్మహత్య


అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లికి చెందిన గొర్లె వరుణ్‌ కుమార్‌ వేచలం గ్రామ సచివాలయంలో జూనియర్‌ లైన్‌మేన్‌గా పనిచేస్తున్నారు. వరుణ్ కుమార్ కు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందుకు తల్లి పైడితల్లమ్మ, బంధువులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కొంతకాలం పెళ్లి సంబంధాలు చూడొద్దని వరుణ్‌ కుమార్‌ తల్లిని వారించాడు. అయినా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపం చెందిన వరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం స్నానం చేసి వస్తానని చెప్పి ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికీ వరుణ్ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేశారు. ఎంతసేపటికీ అతను ఫోన్‌ తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఉరి వేసుకుని వరుణ్ ఆత్మహత్య పాల్పడ్డాడు. వరుణ్ బతికి ఉన్నాడేమో పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయింది. మృతుడి తల్లి పైడితల్లమ్మ ఫిర్యాదుతో సీఐ తాతారావు, ఎ.కోడూరు ఎస్‌ఐ లోకేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు.