Kodali Nani: గుడివాడలో పేదల ఇళ్ల నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవే అన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో జగన్‌తో కలిసి పాల్గొన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న వైఎస్‌ కలను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ద్వారా నెరవేరుతతోందని అన్నారు. గుడివాడలో మంగాయాపాలెంలో టిడ్కో గృహాల పంపిణీ చేపట్టడానికి గుడివాడ వచ్చిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు నాని. రూ.800 కోట్ల ప్రాజెక్టుకు గత ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం రూ.180 కోట్లు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. అందులో కూడా రూ.160 కోట్లు కేంద్రమే ఇచ్చిందని అన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే రూ.400 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేటాయించారని చెప్పుకొచ్చారు నాని. కానీ చంద్రబాబు గుడివాడ వచ్చిన ప్రతీసారి కబుర్లు చెప్పి వెళ్లిపోతాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ సొంత ఊరు గుడివాడకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు కొడాలి నాని. 


దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలి: కొడాలి నాని


ఈ కార్యక్రమంలో కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దమ్ముంటే చంద్రబాబు గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో వేసిన రోడ్లు మూడు నెలలకే గుంతలు పడ్డాయని విమర్శించారు. తాను కూడా చంద్రబాబు మాటలు విని ఉంటే చరిత్రహీనుడ్ని అయ్యే వాడినని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు లక్ష ఎకరాలను ఇంటి స్థలాల కోసం సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. ఆ ఇళ్ల కోసం రూ.15 లక్షల కోట్లు వెచ్చిస్తున్నారన్న ఆయన గుడివాడ ప్రజల కోసం చంద్రబాబు ఒక ఎకరం కూడా కొనుగోలు చేసినట్టు చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.


టిడ్కో ఇళ్ల కోసం 320 కి.మీ పాద యాత్ర చేసిన కొడాలి నాని..


గుడివాడలో 20 ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద ప్రజలకు టిడ్కో గృహాల ద్వారా సొంతింటి కల తీరనుంది. గుడివాడ నియోజకవర్గం పరిధిలో దాదాపు 10 వేల మందిపైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం 2007 లో పాదయాత్ర చేశారు కొడాలి నాని. అప్పట్లో గుడివాడ నుంచి హైదరాబాద్ వరకూ 320 కి.మీ పాద యాత్ర చేశారు. అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పేదలకు ఇళ్ల పై వినతిపత్రం అందజేశారు. రెండోసారి సీఎం అవ్వగానే మల్లాయపాలెంలో 77.46 ఎకరాలను సేకరించి పేదలకు పంపిణీ చేశారు. ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పటికి పూర్తి అవ్వడంతో నేడు పేదలకు సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. ఈ ఇళ్ళ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.799.19 కోట్లు ఖర్చు చేసింది. టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 178.63 ఎకరాలు సేకరించి మొత్తం 7,728 మంది పేదలకు పంపిణీ చేయనున్నారు. 


గుడివాడ శివారు మ‌ల్లాయ‌పాలెంలో టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లను నేడు సీఎం జ‌గ‌న్ పేదలకు అందించారు. ఇక్కడ 77.46 ఎకరాలలో ఒకే చోట 8 వేల 912 టిడ్కో ఇళ్లు నిర్మాణం చేపట్టి రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్ ను నిర్మించింది. సీఎం పర్యటన నేపథ్యంలో సభాప్రాంగణంతో పాటు లే అవుట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా నాయకులు. ఈ మేరకు ఉద‌యం తాడేప‌ల్లి నివాసం నుంచి బ‌య‌లుదేరి మ‌ల్లాయ‌పాలెం లే అవుట్‌కు చేరుకొన్నారు జగన్‌. హెలిపాడ్ నుంచి టిడ్కో ఇళ్ల సముదాయానికి చేరుకొని అక్కడ ఉన్న ఫ్లాట్లను పరిశీలించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. సీఎంకు మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, వల్లభనేని వంశీ తదితరులు స్వాగతం పలికారు.