Kishan Reddy started trains in Guntur :  మోడీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందని కేంద్ర మంత్రికిషన్  రెడ్డి తెలిపారు. గుంటూరులో మూడు రైళ్ల ప్రారంభానికి విజయవాడ వచ్చిన ఆయన రైల్వే ఆడిటోరియంలో మీడియాతో మాట్లాడారు.  రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు. జనరల్ బడ్జెట్ లో రైల్వేను విలీనం చేసి.. ఆర్ధికపరమైన సహకారం మోడీ అందిస్తున్నారని తెలిపారు. డిజిటల్ అడ్వాన్స్ టెక్నాలజీ తో రైళ్లు నడుపుతున్నారని అన్నారు. ప్రపంచంలోనే రైల్వే నెట్ వర్కులో భారత్ నాలుగో స్థానంలో ఉందన్నారు. రైల్వే మన దేశ సమగ్రత కు అద్దం పడుతుందని తెలిపారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి.. కొత్త హంగులతో తీర్చిదిద్దున్నామని తెలిపారు. 508 ర్వైల్వే స్టేషన్లను అమృత్ పధకంలో భాగంగా అభివృద్ది చేసేందుకు మోడీ భూమి పూజ చేశారు.  


దేశంలో 41 వందే భారత్ రైళ్లు ఇప్పటి వరకు మొదలయ్యాయని తెలిపారు. సెమీ హై స్పీడ్ రైళ్లు ప్రపంచంలో మొదటి సారిగా స్వదేశీ టెక్నాలజీతో మనం నడిపామని తెలిపారు. కొంతమంది మూర్ఖులు ఈ ప్రక్రియను అవమానించారు.. వక్రీకరించారని మండిపడ్డారు. వాటిని అధిగమించి వందే భారత్ రైళ్లు నేడు అద్భుతంగా నడుస్తున్నాయన్నారు. గంటకు వంద కిలోమీటర్లు వేగంతో వెళ్లే విధంగా భద్రత, సౌకర్యాలతో రైళ్లు నడుస్తున్నాయన్నారు.  53 శాతం రాయితీతో రైల్వే సేవలందిస్తోందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చాలా వేగంగా రైల్వే అభివృద్ధి చెందింది.. స్విట్జర్లాండ్ తో సమానంగా నెట్వర్క్ అభివృద్ధి చేశామని తెలిపారు.  


2004లో కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్‌ రూ.8000 కోట్ల నుంచి రూ. 29 వేల కోట్లకు పెరిగింది.. మోడీ ప్రభుత్వంలో బడ్జెట్‌ రూ.2.8 లక్షల కోట్ల చేరిందన్నారు. రోజుకు 16 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ పెరుగుతోంది.. 5750 కిలోమీటర్ల ట్రాక్ లు, బ్రాడ్ గేజ్ లుగా అభివృద్ధి చేశాం.. రైల్వే లైన్ల విద్యుదీకరణకు రూ.38,650 కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. 26296 కొత్తగా 231 డబ్లింగ్ లైన్లకు రూ.2.7 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేశాం.. అమృత్ భారత్ ద్వారా 1309 రైల్వేస్టేషన్ లు మోడరన్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. 


వందే భారత్ తో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, విశాఖకు కనెక్టివిటీ చేశామన్నారు. ఐదు వందేభారత్ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం సాగిస్తాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయని తెలిపారు. 2018-23 వరకు మూడు లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. రైల్వేకు నిధుల కొరత లేకుండా అభివృద్ది చేస్తున్నాం.. స్థలం కేటాయింపుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని తెలిపారు. దేశంలో ప్రతి రోజూ రెండు కోట్ల మంది రైల్వే ద్వారా ప్రయాణాలు చేస్తున్నారని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు 2.40లక్షల కోట్లుకు బడ్జెట్ పెరిగిందన్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా 70శాతం పెరిగిందని తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు 38,650 కోట్లు కేవలం రైల్వే విద్యుద్దీకరణ కోసం ఖర్చు చేసిందన్నారు. ప్రజలు మరింత మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడంపైనే మోడీ ఆలోచనలు, ఆచరణ అనేది అందరూ తెలుసుకోవాలన్నారు. కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వేను మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.