Kerala News in Telugu: ఈ మధ్య కాలంలో భారత్‌లో వయనాడ్‌ తరహా విపత్తులు తలెత్తుతూనే ఉన్నాయి. వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ముప్పులు వందలాది మందిని బలి తీసుకోగా ఎంతో మందిని నిరాశ్రయులను చేశాయి. వరుస పెట్టి భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు ముంచుకొచ్చాయి. ఈ ఏడాది జూన్‌ నుంచే ఈ ప్రకృతి విపత్తులు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురవడం వల్ల వరదలు ముంచెత్తింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టర్మినల్ 3 వద్ద పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అప్పటి నుంచి అక్కడ వర్షాలు ఏదో రకంగా బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. జులై 27వ తేదీన కోచింగ్ సెంటర్‌లోని క్లాస్‌రూమ్‌లో వరదలు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.



(Image Credits: ANI)


అంతకు ముందు ముంబయిలోనూ వరదలు వచ్చాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు (extreme weather conditions) ఓ హోర్డింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. గతేడాది జులైలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో 27 మంది చనిపోయారు. మహారాష్ట్రలోనూ (Natural Disasters in India) ఇదే స్థాయిలో వర్షాలు కురిశాయి. పలు పర్యాటక ప్రాంతాల్లో వరదలు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు అసోంలోనూ విపరీతమైన వర్షాలు కురవడం వల్ల నదులు ఉప్పొంగాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ విపత్తుల వల్ల 79 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 150కి పైగా జంతువులూ నీళ్లలో పడి కొట్టుకుపోయాయి. 


గతేడాది డిసెంబర్‌లో దక్షిణాదిలో తుఫాన్ గట్టి ప్రభావం చూపించింది. తమిళనాడులో కురిసిన భారీ వర్షానికి 31 మంది బలి అయ్యారు. రోడ్లు జలమయం అయ్యాయి. రైల్వే పూర్తిగా నిలిచిపోయింది. కొద్ది రోజుల పాటు ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. ఈ ప్రభావం నుంచి బయట పడడానికి చాలా సమయమే పట్టింది. గతేడాది అక్టోబర్‌లో భారీ వర్షాలు కురవడం వల్ల హిమాలయాల్లో హిమానీ నదాలు ఉప్పొంగాయి. ఫలితంగా ఈశాన్య రాష్ట్రమైన సిక్కిమ్‌లో వరదలు ముంచెత్తాయి. 50 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ విపత్తు కారణంగా 179 మంది మృతి చెందారు. ఇళ్లతో పాటు వంతెనలూ కొట్టుకుపోయాయి.


2021లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌లూ ధ్వంసమయ్యాయి. 2018 కేరళ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం. ఆ స్థాయిలో ఇక్కడ వరదలు విధ్వంసం సృష్టించాయి. 373 మంది ప్రాణాల్ని తీసింది ఈ విపత్తు. సాధారణం కన్నా 40% కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వాళ్లందరినీ షెల్టర్ క్యాంప్‌లలో ఉంచింది ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన పెను విధ్వంసమే సృష్టించింది. వందలాది మంది శిథిలాల కింద నలిగిపోతున్నారు. 


Also Read: Wayanad Landslides: వయనాడ్ విధ్వంసానికి కారణమిదే, మరో రెండు రోజుల పాటు ఇదే బీభత్సం!