Electric Scooter Explodes:


కర్ణాటకలో ఘటన..


విద్యుత్ వాహనాలకు డిమాండ్ ఎంత పెరుగుతోందో...అదే స్థాయిలో వాటిపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పలు చోట్ల బైక్‌లు పేలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పేలిన ఘటనలో 5గురు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇంట్లో ఛార్జింగ్‌ పెట్టి ఉన్న స్కూటర్‌ ఒక్కసారిగా పేలింది. ప్రమాద సమయంలో ఇంట్లో 5గురు ఉన్నారు. వారెవరికీ గాయాలు కాలేదు. కాకపోతే కొన్ని సామాన్లు మాత్రం ధ్వంసమయ్యాయి. మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలో వలగెరెహళ్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఆర్నెల్ల క్రితం రూ.85,000 పెట్టి  Route Electric కంపెనీ స్కూటర్‌ కొనుగోలు చేశాడు ముత్తురాజ్. ఉదయ 8 గంటలకు ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టాడు. అలా పెట్టిన కొద్ది నిముషాల్లోనే పెద్ద చప్పుడుతో బ్యాటరీ పేలిపోయింది. స్కూటర్ మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో టీవీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, మొబైల్ ఫోన్‌లు కాలిపోయాయి. 


"ప్రమాదం జరిగినప్పుడు మా కుటుంబం అంతా అక్కడే ఉంది. ఓ పిల్లాడు స్కూటీకి దగ్గర్లోనే ఉన్నాడు. మంటలు ఆర్పలేకపోయాం. రెండు మూడు ఫోన్లు కాలిపోయాయి. ఫ్రిడ్జ్, టీవీ, డైనింగ్ టేబుల్‌, అద్దాలు ధ్వంసమయ్యాయి"  


- బాధితుడు


కేంద్రం అలెర్ట్..


ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీదారుల‌కు కేంద్రం గతేడాది షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లోపాలు కలిగి ఉన్న వాహనాలు విక్రయించారని ఆరోపిస్తూ... ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులు ఓలా, ఒకినావా, ప్యూర్‌ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. ఈ నెలాఖ‌రులోగా స‌మాధానం ఇవ్వాల‌ని కేంద్రం ఆదేశించింది.  కేంద్రం ఇచ్చిన నోటీసులకు స్పందించి కంపెనీలు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని కేంద్రం వర్గాలు చెబుతున్నాయి. లోపాలు క‌లిగిన వాహ‌నాల‌ను వినియోగ‌దారుల‌కు విక్రయించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ తన నోటీసులో కేంద్రం ప్రశ్నించింది. మెల్లిమెల్లిగా అంతా ఎలక్ట్రానికి వాహనాలవైపు మొగ్గుతున్న టైంలో వరుస ప్రమాదాలు కేంద్రానికి తలనొప్పిగా మారింది. వినియోగదారుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కంపెనీలు త‌యారు చేసిన ఎలక్ట్రిక్ వాహ‌నాల్లో కొన్నింటిలో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా ఫైర్‌ యాక్సిడెంట్ అయినట్టు విచారణలో తెలినట్టు తెలుస్తోంది. వరుసబెట్టి ఇలాంటి సంఘటనలు జరగడంతో కేంద్రానికి కోపం తెప్పించింది. అందుకే ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై  గతేడాది ఏప్రిల్‌లో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ... ఓ కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, జరిగిన వాటికి కారణాలు తెలుసుకునేందుకు ఆ కమిటీ పని చేస్తుందని చెప్పారు. ఒక వేళ ఇది కంపెనీ తప్పులు ఉంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అప్పట్లోనే హెచ్చరించారు. అలాంటి లోపాలు ఉన్న వాహనాలను వెనక్కి తీసుకునేలా కూడా ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. అయితే...ఛార్జింగ్ పెట్టేటప్పుడు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. 


Also Read: Oscars 2023: నాటు నాటు పాట కొన్నేళ్ల పాటు నిలిచిపోతుంది, దేశం గర్విస్తోంది - ప్రధాని మోదీ ప్రశంసలు