Karnataka Congress Ledaer's Daughter Killed: కర్ణాటకలో కాంగ్రెస్ నేత కూతురి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ హత్య వెనకాల లవ్ జిహాద్ కుట్ర ఉందని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజ్ క్యాంపస్‌లోనే ఈ హత్య జరగడం మరింత సంచలనమైంది. కాంగ్రెస్ లీడర్ నిరంజన్ హిరేమత్ (Niranjan Hiremath) కూతురు నేహా (Neha Hiremath Murder) హుబ్బల్లిలో ఓ యూనివర్సిటీలో MCA ఫస్టియర్ చదువుతోంది. కొంత కాలంగా ఫయాజ్ అనే యువకుడు ఆమె వెంట పడుతున్నాడు. అయితే..వీళ్లిద్దరూ మంచి స్నేహితులను సన్నిహితులు చెబుతున్నారు. అయితే...ప్రేమిస్తున్నానంటూ వెంట పడడం వల్ల నేహా అతడిని దూరం పెట్టిందని, అందుకే కాలేజ్‌లోనే కత్తితో పొడిచి హత్య చేశారని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఫయాజ్ అదే కాలేజ్‌లో చదువుతున్నప్పటికీ కొన్ని రోజుల తరవాత చదువు మానేశాడని పోలీసులు వెల్లడించారు. కత్తితో పొడిచిన తరవాత అక్కడి నుంచి పారిపోయిన ఫయాజ్‌ని పోలీసులు వెతికి పట్టుకున్నారు. ఈ ఇద్దరూ కలిసే చదువుకున్నారని తెలిసిందని,విచారణ పూర్తైన తరవాత కానీ హత్యకు కారణాలేంటని చెప్పలేమని పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలో కాలేజ్‌లోని CC కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే..అటు ప్రతిపక్షాలు ఈ హత్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ కూతురికే రక్షణ లేకుండా పోయిందని మండి పడుతున్నాయి. కర్ణాటకలో మహిళలకు భద్రత లేదని విమర్శిస్తున్నాయి. ఇక లవ్‌ జీహాదీ కోణమూ (Karnataka Love Jihad Incident) ఉందని కొందరు ఆరోపించడం వల్ల ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 


సీఎం సిద్దరామయ్య ఏమన్నారంటే..


ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. ఈ హత్యకి లవ్‌ జీహాద్‌కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. బీజేపీ అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తోందని మండి పడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పిన ఆయన విచారణ జరుగుతోందని వెల్లడించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇది కచ్చితంగా లవ్ జిహాద్ ఘటనే అని...ప్రభుత్వమే కావాలనే విచారణ జరపకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అయితే...ఈ ఘటనపై నేహా తండ్రి, కాంగ్రెస్ నేత నిరంజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేహా, ఫయాజ్ ఇద్దరూ స్నేహితులు మాత్రమేనని అంతకు మించి వాళ్ల మధ్య ఏమీ లేదని వెల్లడించారు. చాలా సార్లు ప్రేమించాలని వెంటపడినా, అతనికి వార్నింగ్ ఇచ్చి పంపిందని వివరించారు. ఆమెకి చదువుపై తప్ప వేరే ధ్యాసలేమీ ఉండేవి కావని తెలిపారు. అతనంటేనే తన కూతురికి ఇష్టం ఉండేది కాదని, అతని ప్రవర్తన చూసి దూరం పెట్టిందని అన్నారు. ఇంతలోనే ఇలా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. 


Also Read: Viral Video: మీరెప్పుడైనా బిస్లరీ వాటర్ దోశ తిన్నారా? ఇదిగో ఇలా తయారు చేసుకోండి