Karnataka Raj Bhavan Oath Ceremony: కర్ణాటక రాజకీయం మళ్లీ సంచలన మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మంత్రివర్గ విస్తరణకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసింది. సుదీర్ఘ చర్చలు, కసరత్తుల అనంతరం నూతన మంత్రుల తుది జాబితాకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. శనివారం ఢిల్లీ వేదికగా మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన కీలక భేటీ తర్వాత ఈ తుది జాబితాను సీఎం డీకే శివకుమార్కు పంపారు. బెంగళూరులో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.
ఈ విస్తరణలో భాగంగా మొత్తం 20 మంది నేతలకు మంత్రివర్గంలో స్థానం లభించనుంది. ప్రస్తుత మంత్రివర్గంలోని సీనియర్ నేతలు బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, సంతోష్ లాడ్ వంటి ప్రముఖులతో పాటు ప్రాంతీయ, సామాజిక సమతుల్యతను పాటిస్తూ పలువురు కొత్త ముఖాలకు అవకాశమిచ్చారు. పార్టీ అధిష్ఠానం నుంచి ఆమోదం పొందిన ఈ జాబితాను రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజ్ భవన్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్కు అందజేయనున్నారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
మంత్రివర్గ విస్తరణతో పాటు శాసనసభ స్పీకర్ నియామకంపైనా అధిష్ఠానం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. కర్ణాటక శాసనసభ తదుపరి స్పీకర్గా సీనియర్ నాయకుడు జీఎస్ పాటిల్ పేరును కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది. సభను సమర్థవంతంగా నడిపించడంలో ఆయనకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ కీలక బాధ్యతలను అప్పగిస్తున్నట్లు అధిష్ఠానం స్పష్టం చేసింది. జీఎస్ పాటిల్ నియామకంతో సభలో పాలనాపరమైన సమన్వయం మరింత మెరుగుపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నప్పటికీ, లోక్సభ ఎన్నికల తదుపరి సమీకరణలు మరియు 2028 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఈ ఎంపికలు జరిగాయి. పాతమైసూరు, కళ్యాణ కర్ణాటక, ముంబై కర్ణాటక ప్రాంతాలకు బ్యాలెన్స్ చేస్తూ, లింగాయత్, వొక్కలిగ, కురుబ, ఎస్సీ/ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు సమన్యాయం చేసేలా జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ నేతల్లో కొందరికి అసంతృప్తి కలగకుండా అధిష్ఠానం ముందుగానే సంప్రదింపులు జరిపింది.
ఈ నూతన విస్తరణ ద్వారా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిపాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణ పూర్తయితే శాఖల కేటాయింపు సైతం శరవేగంగా జరగనుంది. సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో జరగనున్న ఈ విస్తరణతో రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు మరింత బిగుస్తుందా లేదా అసమ్మతి స్వారాలు వ్యక్తమవుతాయా అనేది ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కర్ణాటక మంత్రివర్గం విస్తరణకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ నేతలు కూడా పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
