Jharkhand CM Hemant Soren: 'ప్రశ్నించడం ఎందుకు? అరెస్ట్ చేయండి'- ఈడీకి సీఎం హేమంత్ సొరేన్ సవాల్

ABP Desam   |  Murali Krishna   |  03 Nov 2022 04:45 PM (IST)

Jharkhand CM Hemant Soren: ఈడీకి చేతనైతే తనను అరెస్ట్ చేయాలని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అన్నారు.

'ప్రశ్నించడం ఎందుకు? అరెస్ట్ చేయండి'- ఈడీకి సీఎం హేమంత్ సొరేన్ సవాల్

Jharkhand CM Hemant Soren: తనకు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఘాటుగా స్పందించారు. ఒక గిరిజన ముఖ్యమంత్రిని వేధించే పన్నాగంలో ఇదంతా భాగమని ఆయన ఆరోపించారు.

నేను దోషి అయితే, మీరు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండి. అధికార భాజపాను వ్యతిరేకించే వారి గొంతును అణిచివేసేందుకు రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కుట్రకు తగిన సమాధానం వస్తుంది.                                       -   హేమంత్ సొరేన్, ఝార్ఖండ్ సీఎం

రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం హాజరుకావాలని సోరెన్‌ను ఈడీ కోరింది. అయినప్పటికీ సీఎం హాజరు కాలేదు. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఎం హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

అంతకుముందు

ఈ విచారణకు సీఎం హాజరుకారని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉదయమే తెలిపారు

మేం దీనిపై రాజ్యాంగబద్ధంగా పోరాడతాం. సీఎం హేమంత్ సొరేన్.. ఈడీ కార్యాలయానికి వెళ్లరు. ఆయనకు ముందస్తు ప్రణాళికలు ఉన్నాయి. ఆయన వేరే కార్యక్రమాలకు హాజరవుతారు.                                         "

-రామచంద్ర సింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఈ కేసులో ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. జులైలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించిన ఈడీ పంకజ్ మిశ్రా బ్యాంకు ఖాతాల నుంచి 11.88 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. అనంతరం జులై 19న అతడ్ని అరెస్టు చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించి వచ్చిన నేరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది.

2019 ఎన్నికల్లో

2019లో జరిగిన ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్​-జేఎంఎం-ఆర్​జేడీ కూటమి జయకేతనం ఎగురవేసింది. ఈ కూటమి మొత్తం 47 స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 స్థానాలు ఎక్కువ సాధించింది. ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తోన్న హేమంత్‌ సోరెన్‌ సారథ్యంలోని జేఎంఎం 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఝార్ఖండ్‌ శాసనసభలో మొత్తం 81స్థానాలు. జేఎంఎం 30 సీట్లలో, కాంగ్రెస్ 16, ఆర్​జేడీ ఒకచోట గెలుపొందాయి. భాజపా 25, ఏజేఎస్​యూ 2, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. 1995 నుంచి జంషెడ్‌పుర్‌ తూర్పు నుంచి 5 సార్లు ప్రాతినిథ్యం వహించిన ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత రఘుబర్‌దాస్ ఓటమిపాలయ్యారు. రఘుబర్‌దాస్‌పై 8 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు స్వతంత్ర అభ్యర్థి సరయిరాయ్‌. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయనకు భాజపా టికెట్‌ నిరాకరించినందున తిరుగుబాటు అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఆరుగురు మంత్రులు, స్పీకర్‌ కూడా ఓటమిపాలయ్యారు.

Also Read: Kerala Governor - CM Vijayan: 'రాజీనామాకు నేను రెడీ మరి మీరూ?'- ముఖ్యమంత్రికి గవర్నర్ సవాల్

Published at: 03 Nov 2022 04:21 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.