Jammu Kashmir: జమ్ముకశ్మీర్లో కశ్మీరీ పండిట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇటీవల పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేయడంతో అక్కడ పరిస్థితులు భయాందోళనగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. తాజాగా షోపియాన్ జిల్లా, చౌదరిగుండ్ గ్రామం నుంచి చిట్ట చివరి కశ్మీరీ పండిట్ మహిళ కూడా ఆ గ్రామాన్ని విడిచి పెట్టింది.
వలస
చౌదరిగుండ్ గ్రామం నుంచి ఉగ్రవాదుల భయంతో కశ్మీరీ పండిట్లు తరలివెళ్లిపోయారు. అయితే డోలీ కుమారి అనే మహిళ మాత్రం ధైర్యంగా అక్కడే ఉంది. తాజాగా ఆమె కూడా ఆ గ్రామాన్ని విడిచిపెట్టాంది. గురువారం సాయంత్రం ఆమె జమ్మూకు వలస వెళ్లిపోయింది.
ఇటీవల కశ్మీరు లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగాయి. దీంతో ఈ గ్రామంలో మిగిలిన ఏడు కశ్మీరీ పండిట్ కుటుంబాలు నెమ్మదిగా జమ్మూకు వలసపోయాయి.
లోయలో భయానక వాతావరణం ఉంది. ఇంతకన్నా నేను ఏం చేయగలను. మిగిలిన హిందూ కుటుంబాలు ఈ గ్రామాన్ని విడిచిపెట్టినప్పటికీ, నేను కొద్ది రోజులపాటు ధైర్యంగానే నా ఇంట్లో ఉన్నాను. పరిస్థితి మెరుగుపడితే నేను తిరిగి స్వగ్రామానికి వస్తాను. సొంతింటిని వదిలిపోవడానికి బాధగా ఉంది. కానీ తప్పడం లేదు. - డోలీ కుమారి, కశ్మీరీ పండిట్