IT Raids: తెలంగాణలో ఐటీ సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మూడో లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డిని సీన్‌లోకి తీసుకొచ్చింది ఐటీ శాఖ. ఆయన  నివాసంలో కూడా ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. మొబైల్స్ స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. మధుసూధన్ రెడ్డి, భార్య, కుమారుడిని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు మర్రి, పైళ్లతో సహ మధుసూధన్ రెడ్డి నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ భాగస్వామ్య వ్యాపార లావాదేవీలపై ఐటీ ఆరా తీస్తోంది ఐటీ శాఖ. ఇటీవలి కాలంలో బిఆర్ఎస్ నేతలతో మధుసూధన్ రెడ్డి జరిపిన లావాదేవీలపై ఎంక్వయిరీ చేస్తోంది. హైదరాబాద్ భారీ ప్రాజెక్టులు చేపట్టిన సంస్థతో జరిగిన ఒప్పందాలపై దర్యాప్తు చేస్తోంది. బీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ సిండికేట్ పై ఐటీ కన్నేసింది. 


ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లతో పాటు వారి బంధువులు, కార్యాలయాల్లో మూడో రోజు  సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే పలు కీలక పత్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు బ్యాంక్ లాకర్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 60 ప్రాంతాల్లో 400 మంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. 


వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారుల ఆరా..


ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. నిన్న(బుధవారం) అంతా నివాసాలు, అలాగే కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు రాబట్టిన అధికారులు నేడు వారి వ్యాపార లావాదేవీల గురించి ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి శేఖర్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్థిక లావాదేవీల పై ఐటీ దృష్టి పెట్టింది. అంతేకాకుండా గత రెండేళ్లుగా కంపెనీకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు వారు చెల్లిస్తోన్న పన్నులుకూ మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. 


మరోవైపు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. అలాగే తీర్థా గ్రూప్ కు డైరెక్టర్ గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారట ఐటీ అధికారులు. అలాగే హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు గుర్తించినట్లు సమాచారం. 


ఐటీ సోదాలపై స్పందించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి..


గత కొన్ని రోజులుగా జరుగుతోన్న ఐటీ సోదాలపై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి స్పందించారు. గతంలోనూ ఇలాగే తమ కంపెనీల్లో ఐటీ సోదాలు జరిగాయని ఎమ్మెల్యే అన్నారు. అప్పుడు లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆదాయ పన్ను అధికారులే రెండు అవార్డులు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే సోదాలు చేసి మరో రెండు అవార్డులు ఇస్తారని అన్నారు. గత రెండు రోజులుగా తమ కంపెనీల్లో సోదాలు చేస్తున్నారని, ఈ సోదాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదని అన్నారు. ఐటీ అధికారులు తీను సహనాన్ని పరిక్షించేలా ఉందని అసహనం వ్యక్తం చేశారు. కానీ ఐటీ అధికారులు అడిగిన వివరాలు అన్నీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే సోదాల్లో తమ సంస్థల ఉద్యోగుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనిన తెలుస్తోందని, అలాంటి పద్దతి మంచిది కాదని హితవు పలికారు. ఏదైనా లోపాలు ఉంటే అందుకు తగిన పన్నులు కట్టించుకోవాలిగానీ ఇలా చేయడం సరికాదన్నారు.