Iran Israel Attack: ఇజ్రాయేల్, ఇరాన్ మధ్య యుద్ధ (Israel Iran War) వాతావరణం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకూ హమాస్‌తో పోరాడిన ఇజ్రాయేల్ ఇప్పుడు ఇరాన్‌తోనూ పోరాటం చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఇరాన్‌ ఇజ్రాయేల్‌పై డ్రోన్ అటాక్ మొదలు పెట్టింది. మిజైల్స్‌తోనూ దాడి చేసింది. ఈ దాడితో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయేల్ మిలిటరీ చెప్పిన వివరాల ప్రకారం..ఇరాన్‌ దాదాపు 100 డ్రోన్స్‌తో దాడులు చేసింది. ఇరాక్, జోర్డాన్‌ సాయం తీసుకుని ఈ దాడి చేసినట్టు వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇజ్రాయేల్‌కి అమెరికా అండగా నిలబడుతోంది. ఇరాన్‌కి మిజైల్స్‌పై ఎదురు దాడి చేయడంలో ఇజ్రాయేల్‌కి సహకరిస్తున్నట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు జోబైడెన్ ఇప్పటికే ప్రకటించారు. జోబైడెన్‌ ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ఈ దాడులపై నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. తమకు హాని కలిగించే వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌ చేసిన దాడులతో ఇజ్రాయేల్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్ రక్షణశాఖ మంత్రి మహమ్మద్ రెజా అస్తియాని సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయేల్‌ ఇరాన్‌పై దాడి చేసేందుకు ఏ దేశం సహకరించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 






ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని డిఫెన్స్ సిస్టమ్స్‌ని యాక్టివ్‌గా ఉంచుకోవాలని అధికారులకు నెతన్యాహు ఆదేశాలిచ్చారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పారు. ఆత్మరక్షణకైనా, ఎదురు దాడికైనా సిద్ధంగానే ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమయంలో తమకు మద్దతునిస్తున్న అమెరికా, యూకే, ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాలకు ఆయన థాంక్స్ చెప్పారు. ఇటు భారత్‌ కూడా ఈ యుద్ధంపై స్పందించింది. ఇరాన్ వెంటనే ఈ దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు రెండు దేశాలూ చొరవ తీసుకోవాలని సూచించింది.