Indy Alliance MPs deliberately cast invalid votes for Sudarshan Reddy: ఆత్మప్రబోధానుసారం తనకు ఓటు వేయాలని సుదర్శన్ రెడ్డి ఇతర పార్టీల ఎంపీలను కోరితే ఇండీ కూటమి ఎంపీలే ఆయనకు హ్యాండిచ్చారు. ఉద్దేశపూర్వకంగా క్రాస్ ఓటింగ్ చేయడంతో పాటు కావాలని ఓట్లు చెల్లకుండా చేశారు. ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మొత్తం 452 ఓట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి ఉన్న బలం 438 మాత్రమే. అంటే ఆయనకు పధ్నాలుగు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. వైసీపీ సభ్యులు మద్దతుగా ఓట్లు వేశారు. అయినా ఆప్ ఎంపీ ఒకరు. ఆర్జేడీ ఎంపీ ఒకరు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేశారు. అంటే రాధాకృష్ణన్కు మద్దతుగా క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో బలం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండీ కూటమి పార్టీల బలం ప్రకారం కనీసం 314 రావాల్సి ఉంది. కానీ ఆయనకు ఉత్తరాది ఎంపీలు హ్యాండిచ్చారు. అఫీషియల్గా ఆప్ ఎంపీ ఒకరు.. ఆర్జేడీ ఎంపీ ఒకరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. మిగిలిన ఎంపీల్లో చాలా మంది క్రాస్ ఓటింగ్ కు పాల్పడకపోయినా .. తమ ఓటును కావాలనే చెల్లకుండా చేశారు. చెల్లని ఓట్లన్నీ ఇండీ కూటమి అభ్యర్థివేనని ..వచ్చిన ఓట్లను బట్టి తేలిపోయింది. అంటే కావాలనే తమ ఓట్లు చెల్లకుండా పోవాలన్న ఉద్దేశంతోనే వారు అలా ఓట్లు వేశారు.
రాధాకృష్ణన్ విజయంపై మొదటి నుంచి ఎవరికీ అనుమానాల్లేవు. ఎన్డీఏకి ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేస్తారు కానీ..ఇండీ కూటమికి క్రాస్ ఓటింగ్ చేసే అవకాశాల్లేవు. అయితే ఇండీ కూటమికి ఎంత మంది హ్యాండిస్తారన్న చర్చే జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. రాధాకృష్ణన్ భారత 17వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాజ్యసభ చైర్మన్ కూడా ఆయనే. ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు.
ఇండీ కూటమి అభ్యర్థికి రావాల్సిన ఓట్లు కూడా రాకపోవడం.. ఆ కూటమి ఐక్యత లేని తనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. చెల్లని ఓట్లు వేసిన వాళ్లంతా బీజేపీతో టచ్ లో ఉన్నారని అనుకోవచ్చు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫలితాన్ని స్వాగతిస్తున్నట్లుగా సుదర్శన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.