Indori Dighori Flyover In Nagpur Cuts Through Home: ఫ్లైఓవర్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇళ్లకు చాలా దూరంగా ..రోడ్ల మధ్యలో ఫ్లైఓవర్లు ఉంటాయి. కానీ విచిత్రంగా నాగపూర్ లో కట్టిన ఓ ఫ్లైఓవర్ మాత్రం ఓ ఇంటి బాల్కనీ నుంచి వెళ్లింది. 

నాగ్‌పూర్‌లో రూ.998 కోట్లతో నిర్మితమవుతున్న ఇండోరా-డిఘోరి ఫ్లైఓవర్‌లో భాగంగా, అశోక్ స్క్వేర్ వద్ద ఒక ఇంటి బాల్కనీ ద్వారా ఫ్లైఓవర్ బీమ్ చొచ్చుకొచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.  ఈ ఇల్లు సక్కర్దారా రోడ్డు మూలలో ఉంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో అనేక కామెంట్లు రావడంతో సంబంధిత అధికారులు  తమ వాదన వినిపించారు. 

 ఆ ఇల్లు అక్రమంగా నిర్మించారని ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో ఈ "ఎన్‌క్రోచ్‌మెంట్" గుర్తించారని.. నాగపూర్ మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.  ఇంటి యజమాని కూడా ఫ్లైఓవర్ బాల్కనీ ద్వారా నిర్మించడానికి వ్యతిరేకత వ్యక్తం చేయలేదని, ఒప్పందం కుదిరిందని అధికారి తెలిపారు. అయితే ఇంటి యజమాని ప్రవీణ్ పాత్రే,  అతని కుమార్తె శ్రీస్తి తమ ఇల్లు 150 సంవత్సరాల పాతదని, 25 సంవత్సరాల క్రితం రీనోవేట్ చేసుకున్నామని చెబుతున్నారు.  ఫ్లైఓవర్ నిర్మాణానికి వ్యతిరేకత లేదని, భద్రతపై కూడా ఆందోళన లేదని  చెబుతున్నారు 

ఈ ఫ్లైఓవర్ ను సోషల్ మీడియాలో కొంత మంది  "ఎనిమిదో వండర్"గా చెబుతున్నారు.  అధికారులు ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు తొలగించలేదని  ప్రశ్నిస్తున్నారు. ఇల్లు అధికారికమైతే ఎందుకు సముచిత పరిహారం ఇవ్వలేదని  అడుగుతున్నారు.  ఇండోరా-డిఘోరి ఫ్లైఓవర్ ప్రాజెక్ట్, NHAI ఆధ్వర్యంలో నిర్మితమవుతోంది. ఇది నాగ్‌పూర్‌లోని ఇండోరా చౌక్ నుంచి డిఘోరి చౌక్ వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో నిర్మిస్తున్నారు.  ప్రాజెక్ట్ ఖర్చు రూ.998 కోట్లు..  NCC లిమిటెడ్ నిర్మిస్తోంది.  

ఈ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తోంది. 

నిజానికి అది అక్రమం అయితే..తొలగించాలి... సక్రమం అయితే చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి కూల్చివేయాలి. అలా చేయకుండా ఇంటి యజమాని అంగీకరించారని.. ఇంట్లో నుంచి ఫ్లైఓవర్ నిర్మించడం వివాదాస్పదమవుతోంది. ఆ ఫ్లైఓవర్ అలా ఉండటం వల్ల వినియోగంలోకి వచ్చాక అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.