Indian man filed harassment suit against executive:  జె.పి. మోర్గాన్  వంటి ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ దిగ్గజ సంస్థలో చోటుచేసుకున్న  లైంగిక వేధింపుల ఉదంతం ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. తన బాస్ తనను లైంగికంగా వేధించడమే కాకుండా, జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారంటూ భారత సంతతికి చెందిన  చిరాయు రాణా  సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కారు.   అగ్రశ్రేణి పెట్టుబడి సంస్థ జె.పి. మోర్గాన్ ఛేజ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన చిరాయు రాణా, తనపై పైఅధికారిణి  లోర్నా హజ్దిని  సుదీర్ఘకాలం పాటు సాగించిన వేధింపులపై న్యూయార్క్ కోర్టులో దావా వేశారు. ఇప్పటివరకు గోప్యంగా ఉన్న ఆయన పేరు, తాజాగా కోర్టు డాక్యుమెంట్ల ద్వారా బయటకు వచ్చింది. లోర్నా హజ్దిని తనను కేవలం శృంగార పరికరంగా చూడటమే కాకుండా, తన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించినట్లు రాణా పేర్కొన్నారు. చిరాయు రాణా తన పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు సోషల్ మీడియాలో  వైరల్ అయ్యాయి. ఈ రాత్రి నువ్వు నాతో శృంగారంలో పాల్గొనకపోతే, నీ ప్రమోషన్‌ను అడ్డుకుంటాను  అని ఆమె రాణాను నేరుగా బెదిరించేవారు. అంతేకాకుండా,  త్వరలో నాతో పడక సుఖాన్ని పంచుకోకపోతే నిన్ను నాశనం చేస్తాను.. నేను నిన్ను సొంతం చేసుకున్నాను  అన్న విషయం మర్చిపోవద్దు  అని హెచ్చరించేవారు.  భారతీయ మూలాలున్న రాణాను ఉద్దేశించి..  మేనేజ్‌మెంట్ ఎవరో ఒక భారతీయ కుర్రాడు సంస్థను నడిపించాలని అనుకుంటుందని నువ్వు నిజంగా భావిస్తున్నావా  అని హేళన చేసేవారు. రాణా భార్యను ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారు.  నీ ఆసియా భార్యకు నాకున్నంత అందమైన వక్షోజాలు ఉండవు  అంటూ తన శరీర భాగాలను చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2012లో అనలిస్ట్‌గా చేరిన రాణా, తన కష్టంతో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. అయితే, లోర్నా వేధింపులను తిరస్కరించినందుకు గాను ఆమె తనపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో పనికిరాని తప్పులు వెతకడం, ఇతర ఉద్యోగుల ముందు అవమానించడం వంటి పనుల ద్వారా తనను మానసిక క్షోభకు గురిచేసినట్లు తెలిపారు. 

 ఈ వ్యవహారంపై జె.పి. మోర్గాన్ యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం ఉన్నప్పటికీ, బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు లోర్నా హజ్దిని కూడా ఈ ఆరోపణలపై స్పందించలేదు. ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత హోదాలో ఉన్న మహిళ, ఒక పురుష ఉద్యోగిని ఈ స్థాయిలో వేధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిరాయు రాణా వేసిన ఈ కేసు ఫలితంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ మరియు బ్యాంకింగ్ నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.