ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎన్నికల వేళ వారిద్దరూ ఒకరిపైఒకరు చేసుకున్న విమర్శల గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి వీరిద్దరూ ఎదురెదురు పడితే ఏమవుతుంది? ఆసక్తికరంగా ఉంది కదా.. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో సోమవారం ఈ ఆసక్తికర ఘటన జరిగింది.






ఏం చేశారు?


కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు.. యూపీ అసెంబ్లీలో నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఫేస్ టూ ఫేస్ రావాల్సి వచ్చింది. అయితే ఒకరినొకరు చూసి ఆప్యాయంగా నవ్వుకున్నారు. అంతేకాదు యోగికి అఖిలేశ్ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు.


ఎన్నికల ప్రచారంలో ఎన్నోసార్లు యోగిని 'బాబా ముఖ్యమంత్రి' అంటూ అఖిలేశ్ విమర్శలు చేశారు. మరోవైపు యోగి.. సమాజ్‌వాదీలను 'పరివార్‌వాదీ' అని అన్నారు.


భారీ విజయం


ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా భారీ విజయాన్ని సాధించింది. వరుసగా రెండోసారి యూపీలో సర్కార్‌ను ఏర్పాటు చేసింది. 





గోరఖ్‌పుర్ అర్బన్ నుంచి పోటీ చేసిన యోగి.. 1,03,390 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం యోగికి ఇదే తొలిసారి. యూపీ సీఎంగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీకాలం పనిచేసి ఓ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రావడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి.




403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది.


మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.


మరోవైపు భాజపా దెబ్బకు కాంగ్రెస్‌, బహుజన సమాజ్‌ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.