UP Assembly New Rules: 



అసెంబ్లీలో కొత్త నిబంధనలు 


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. ఈ రూల్స్ ప్రకారం సభ్యులెవరైనా సరే సభ లోపల ఫోన్ కాల్స్ మాట్లాడడానికి వీల్లేదు. డాక్యుమెంట్స్‌ని చింపడమూ ఇకపై కుదరదు. స్పీకర్‌కి ఎదురుగా నిలబడడం, కూర్చోవడానికీ వీలు ఉండదు. ఎప్పుడో 1958లో యూపీ అసెంబ్లీలో నియమావళి తీసుకురాగా...అందులో కొత్తగా మార్పులు చేర్పులు చేశారు. ఈ కొత్త నియమావళి అందుబాటులోకి రాగానే పాతది రద్దైపోతుంది. ఇప్పటికే అసెంబ్లీలో దీనిపై చర్చ జరుగుతోంది. ఆగస్టు 10న ఈ నియమావళిని ప్రవేశపెట్టి తక్షణమే అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహన వెల్లడించారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం సభ్యులెవరైనా నిరసన వ్యక్తం చేస్తూ డాక్యుమెంట్స్‌ని చించడానికి వీలుండదు. ప్రసంగించే సమయంలో గ్యాలరీలోని వ్యక్తులను వేలెత్తి చూపించకూడదు. సభలోకి ఆయుధాలు తీసుకురావడం, వాటిని అందరి ముందూ ప్రదర్శించడమూ చెల్లదు. అసెంబ్లీ లాబీలో ధూమపానం చేయకూడదు. గట్టిగా నవ్వకూడదు. మాట్లాడకూడదు. 


కారణమిదే..


స్పీకర్‌కి గౌరవమిచ్చే విధంగా సభలోకి వచ్చే ముందు వెళ్లే ముందు, కూర్చునే ముందు లేచే ముందు "వీపు" చూపించకూడదు. అసెంబ్లీ సమావేశాలు 14 రోజుల పాటు జరిగే నిబంధననూ మార్చి  7 రోజులకు తగ్గించారు. నచ్చిన సాహిత్యాన్ని, క్వశ్చనీర్‌ని, పుస్తకాల్ని, ప్రెస్ కామెంట్స్‌ని తీసుకెళ్లకూడదు. ఇక ప్రొసీడింగ్స్‌తో సంబంధం లేని స్లిప్స్‌ని పంచుకోకూడదు. అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్మెల్యేల రోజు వారీ విధుల్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుతారు. గతేడాది డిసెంబర్ 6వ తేదీన ఎస్‌పీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ యూపీ అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ని ఫేస్‌బుక్‌ లైవ్‌లో స్ట్రీమింగ్ చేయడం సంచలనమైంది. రాంపూర్ ఉప ఎన్నికల విషయంలో నిరసన వ్యక్తం చేస్తున్న వీడియోలూ బయటకు వచ్చాయి. ఇది గమనించిన స్పీకర్ వెంటనే ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారు. ఇలాంటివి మరోసారి జరగకుండా ఇలా కొత్త నిబంధనలు తీసుకురానున్నారు.