UP Teacher: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌ లోని తృప్తి త్యాగి అనే మహిళా టీచర్ పాఠశాలలోని ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముజఫర్‌నగర్‌ ఖుబ్బాపూర్ గ్రామంలోని నేహా పబ్లిక్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. రెండో తరగతి చదివే ముస్లిం విద్యార్థిని నేహా పబ్లిక్ స్కూల్ హెడ్‌మిస్ట్రెస్ తృప్తి త్యాగి తోటి విద్యార్థులతో కొట్టించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు స్పందించి స్కూల్ ను మూసేయించింది. అయితే ఈ ఘటనపై పలు వార్తా ఛానళ్లు తృప్తి త్యాగిని వివరణ కోరగా.. ఆమె తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. అది చాలా చిన్న విషయమని, దానిని పెద్దది చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని మొదట్లో సమర్థించుకున్న తృప్తి త్యాగి.. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుండటంతో కాస్త వెనక్కి తగ్గారు. తాను తప్పు చేశానని ఒప్పుకున్నారు. 


ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించడం తప్పేనని తాను తప్పు చేశానని క్షమాపణ కోరారు. అలా కొట్టించడం తప్పేనన్న తృప్తి త్యాగి.. అందులో ఎలాంటి హిందూ-ముస్లిం మత విద్వేషం లేదని చెప్పుకొచ్చారు. తానను వికలాంగురాలినని.. లేవలేకపోవడం వల్లే తోటి విద్యార్థులతో కొట్టించినట్లు తెలిపారు. 


స్కూల్ మూసివేత - యోగి సర్కారు ఆదేశం


ఈ వీడియో వైరల్ అవడం వల్ల ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో స్కూల్‌ని బంద్ చేయాలని యోగి సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే విద్యాశాఖ కూడా ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టింది. స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు పంపింది. స్కూల్ బంద్ చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్థానిక పాఠశాలల్లో వాళ్లందరికీ తాత్కాలిక అడ్మిషన్‌లు ఇచ్చారు. మళ్లీ ఆదేశాలిచ్చేంత వరకూ స్కూల్‌ని ఓపెన్ చేయకూడదని అధికారులు తేల్చి చెప్పారు. నిందితురాలు తృప్తి త్యాగి మాత్రం తన చర్యల్ని సమర్థించుకుంటున్నారు. ఇది చాలా చిన్న విషయం అని కొట్టి పారేస్తున్నారు. కేవలం హోం వర్క్ చేయలేదన్న కారణంగానే విద్యార్థులతో కొట్టించానని, ఇందులో మతపరమైన వివక్ష ఏమీ లేదని తేల్చి చెబుతున్నారు. తల్లిదండ్రులే తమ కొడుకుని కాస్త మందలించాలని కోరినట్టు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు తృప్తి త్యాగి. 


ఆ ముస్లిం విద్యార్థి తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ ఇచ్చారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు. ఈ ఘటన జరిగిన రోజు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడం వల్ల అధికారుల దృష్టికి వెళ్లింది. వాళ్లు విచారణ మొదలు పెట్టాక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 


Also Read: అసలు హిందూమతం అనేదే లేదు, అసమానతలకు బ్రాహ్మణులే కారణం - ఎస్‌పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు


ఖబర్‌పూర్‌ గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ వీడియోలో టీచర్‌ ముస్లింలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. క్లాస్‌లో ఉన్న విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని కొట్టాలని ఆదేశించింది. టీచర్‌ చెప్పినట్టుగానే విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని చెంపపై కొట్టారు. ఇలా కొడుతూ ఉండగా చైర్‌లో కూర్చున్న టీచర్ "ఇంకా గట్టిగా కొట్టండి" అంటూ ఆర్డర్‌ వేసింది. ఓ స్టూడెంట్‌ చెంపమీద కొట్టినా ఆగకుండా...నడుముపైన కొట్టండి అంటూ కుర్చీలో కూర్చుని ఆర్డర్‌లు వేసింది ఆ మహిళా టీచర్.