UP Crime News: ప్రతీకారంతో రగిలే వ్యక్తి చాలా ప్రమాదకరం. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ప్రతీకారేచ్ఛ ఉండే మనిషి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఇదే లైన్ తో తెరకెక్కి సూపర్ హిట్ అయిన మూవీ రంగస్థలం. తన అన్నను చప్పించిన ప్రకాశ్ రాజ్ ను రామ్ చరణ్ చంపడంతో కథ ముగుస్తుంది. అంతకుముందు ప్రకాశ్ రాజ్‌కు ఆక్సిడెంట్ కావడంతో కోమాలోకి పోతాడు. చాలా కాలం పాటు ప్రకాశ్ రాజ్‌ ఉన్న ఆస్పత్రి వద్దే ఉంటూ ఇంటికి కూడా వెళ్లకుండా సపర్యలు చేస్తుంటాడు హీరో. అలా తిరిగి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఒక రోజు ప్రకాశ్ రాజ్‌ను కలిసి తన అన్నను చంపించినందుకు ప్రతీకారంగా నిన్ను కూడా చంపుతానని చెప్పి అప్పుడు ప్రకాశ్ రాజ్‌ను హీరో చంపడంతో కథ ముగుస్తుంది. ఊహలకు ఏమాత్రం అందని రీతిలో క్లైమాక్స్ ను తీర్చిదిద్దడంతో రంగస్థలం మూవీ సూపర్ హిట్టు అయింది. ప్రతీకారంతో రగిలిపోయే హీరో.. ఆ ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఏదైనా చేసి చివరికి రివెంజ్ తీసుకోవడమే అసలైన స్టోరీ.


ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తి ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇది సినిమా కానీ ఇలాంటిదే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో నిజంగా జరిగింది. కొడుకును చంపి జైల్లో ఉన్న వ్యక్తిని బెయిల్ పై బయటకు తీసుకువచ్చి మరీ హత్య చేశాడు. వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన యూపీలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..


ఉత్తర ప్రదేశ్ లోని ఖేరి జిల్లా మితౌలీ గ్రామానికి చెందిన కాశీ కాశ్యప్(50) అనే వ్యక్తి కి 14 ఏళ్ల జితేంద్ర అనే కొడుకు ఉన్నాడు. 2020 సంవత్సరంలో ఓ హత్య కేసులో కాశీ జైలుకు వెళ్లాడు. తర్వాత కాశీ భార్య సమీప బంధువు అయిన శత్రుధన్ లాలా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కాశీ ఎలాగూ లేకపోవడంతో వీరిద్దరి బంధం బలపడింది. అయితే బాలుడు జితేంద్ర వారి సంబంధానికి అడ్డుగా ఉండటంతో వారిద్దరూ కలిగి జితేంద్రను చంపేశారు. ఈ హత్య కేసులో ఇద్దరూ జైలుపాలయ్యారు. గతేడాది కాశీ జైలు నుండి బయటకి వచ్చాడు. కొడుకును చంపిన విషయం తెలుసుకుని ఎంతో కుమిలిపోయాడు. తన కన్న కొడుకుని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయాడు. లాలాపై కోపం పెంచుకున్నాడు. సొంత ఖర్చుతో లాయర్ ను ఏర్పాటు చేసి లాలాకు బెయిల్ ఇప్పించాడు. బెయిల్ పై బయటకు వచ్చిన లాలాను శుక్రవారం రాత్రి తుపాకీతో కాల్చి చంపాడు.


ఇటీవలే తిహార్ జైల్లో గ్యాంగ్ స్టర్ హత్య 


దిల్లీ తిహార్‌ జైల్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో హై రిస్క్ వార్డులో ఉన్న టిల్లు అలియాస్ సునీల్ మాన్ పై మరో గ్యాంగ్ స్టర్ యోగేష్ తుండా, అతడి అనుచరులు దాడి చేశారు. ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. జైలు అధికారులు గమనించి దాడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టిల్లును హుటాహుటిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిల్లు తాజ్ పురియా... దిల్లీలోని అత్యంత క్రూరమైన క్రిమినల్ గ్యాంగ్ కు నేతృత్వం వహిస్తున్నాడు. 2015లో ఓ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి తిహార్‌ జైల్లో ఉంటున్నాడు. టిల్లు గ్యాంగ్ కు దిల్లీకి చెందిన మరో గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగితో ఏళ్ల తరబడి శత్రుత్వం ఉంది. 2021 సెప్టెంబర్ లో గోగి దిల్లీలోని రోహిణీ కోర్టులో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కేసు విచారణ నిమిత్తం అతడిని కోర్టుకు తీసుకురాగా... అదే సమయంలో న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు టిల్లు అనుచరులు.. కోర్డు ఆవరణలోనే గోగిపై కాల్పులకు తెగబడ్డారు. 


దాదాపు 35 నుంచి 40 రౌండ్ల కాల్పులు జరిపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దాడిలో జితేందర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ కాల్పులను తిహార్‌ జైలు నుంచి టిల్లు ఫోన్ లో పర్యవేక్షించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రోహిణి కోర్టు ఘటనలో టిల్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తాజాగా టిల్లుపై దాడి చేసిన యోగేషే.. గోగి గ్యాంగ్ కు చెందిన షార్ప్ షూటర్ అని తెలుస్తోంది. గోగి హత్యకు ప్రతీకారంగానే యోగేష్, టిల్లును హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.