Telugu News: వ్యవసాయ ఆధారిత పరికరాల స్టార్టప్‌లకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం రూ.750 కోట్లతో 'అగ్రిష్యూర్' నిధిని మొదలుపెట్టింది. ఇంటిగ్రేటెడ్ అగ్రి ఇన్వెస్ట్‌మెంట్ పోర్టల్, కృషి నివేష్, 'అగ్రిష్యూర్' ఫండ్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నిధిని ప్రకటించారు.


రూ.750 కోట్ల 'అగ్రిష్యూర్' ఈక్విటీ, డెట్ క్యాపిటల్ రెండింటినీ అందించడం ద్వారా స్టార్టప్‌లకు, వ్యవసాయదారులకు అండగా ఉంటుంది. అయితే, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ నొక్కిచెప్పారు. వ్యవసాయ రూపురేఖలు మార్చడంలో అగ్రిటెక్ స్టార్టప్‌లు, అగ్రిప్రెన్యూర్స్ కీలక పాత్ర పోషిస్తారని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి దాదాపు రూ.14 వేల కోట్లతో 7 పథకాలకు సోమవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లు ఈ నిధిని పూర్తిగా ఉపయోగించుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ఉత్పత్తి, విలువ జోడింపును పెంపొందించడానికి వ్యవసాయంలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడుల ప్రాముఖ్యత గురించి చౌహాన్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేస్తుందని మంత్రి వెల్లడించారు.


దేశపు జీడీపీకి దాదాపు 18 శాతం తోడ్పడే వ్యవసాయం అనేది ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని చౌహాన్ అన్నారు. రైతులు కూడా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగస్వాములు అని అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి.. ఆహారం, పోషకాహార భద్రత మెరుగుదల కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చౌహాన్ వివరించారు.