UK PM Boris Johnson India Visit: మిత్రమా, మీ ఆతిథ్యానికి ఫిదా- నేను ఓ సచిన్, బిగ్ బీలా ఫీలయ్యా: బోరిస్

ABP Desam   |  Murali Krishna   |  22 Apr 2022 06:20 PM (IST)

భారత పర్యటన తనకు ఎంతో సంతోషాన్నించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. తాను సచిన్, అమితాబ్ బచ్చన్‌లో ఫీలయ్యానన్నారు.

మిత్రమా, మీ ఆతిథ్యానికి ఫిదా- నేను ఓ సచిన్, బిగ్ బీలా ఫీలయ్యా: బోరిస్

భారత్ ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. గుజరాత్‌లో పర్యటనను బోరిస్‌ జాన్సన్‌ గుర్తు చేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు భారత ప్రజలకు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు. గుజరాత్‌లో నా కోసం పెట్టిన స్వాగత హోర్డింగ్స్‌ చూసి నేను ఓ సచిన్‌ తెందుల్కర్‌, బిగ్‌బీ అమితాబచ్చన్‌లా ఫీలయ్యాను. ఇలాంటి స్వాగతాన్ని నేను మరెక్కడా చూడలేనేమో. ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు.                                                   - బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని 

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఇండియా చేరుకున్నారు. మొదటిరోజు భారత ప్రధాన నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో బోరిస్‌ జాన్సన్‌ పర్యటించారు. రెండో రోజు దిల్లీలో ప్రధాని మోదీతో బోరిస్‌ భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

వారిని పంపిస్తాం

ఆర్థిక నేరగాళ్ళు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, ఖలిస్థానీ ఉగ్రవాదులను భారత దేశానికి అప్పగించడం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు జాన్సన్ బదులిచ్చారు.

భారత్ సహా ఇతర దేశాలను బెదిరించే ఉగ్రవాద సంస్థల పట్ల తమకు బలమైన దృక్పథం ఉందన్నారు. భారత దేశానికి సహాయపడేందుకు తాము యాంటీ ఎక్స్‌ట్రీమిస్ట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటోన్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి అప్పగించడంలో చట్టపరమైన సాంకేతిక అంశాలు ఉన్నందు వల్ల వీరిని తిరిగి అప్పగించడం సంక్లిష్టమవుతోందని బోరిస్ చెప్పారు. వారిని తిరిగి పంపిచేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించిందన్నారు. భారత దేశంలోని చట్టాన్ని తప్పించుకోవడం కోసం బ్రిటన్‌లోని న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేవారిని తాము స్వాగతించబోమని చెప్పారు. 

బోరిస్ జాన్సన్‌ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భార‌త్ ఆజాదీకా అమృత్ మ‌హోత్సవ్‌ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సమయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఓ చారిత్రక సందర్భం అంటూ మోదీ వ్యాఖ్యానించారు.

Also Read: UK PM Boris Johnson India Visit: బ్రిటన్ ప్రధానితో హైదరాబాద్ హౌస్‌లో మోదీ భేటీ- ఉక్రెయిన్, స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చ

Also Read: Fodder Scam Case: లాలూకి మళ్లీ లక్కీ ఛాన్స్! ఆ కేసులో బెయిల్ ఇచ్చిన కోర్టు

 

Published at: 22 Apr 2022 05:54 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.