పెగాస‌స్ స్పైవేర్ అంశం రాజ్య‌స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ప్ర‌క‌ట‌న చేస్తున్న టైంలో... తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రవర్తించిన తీరు వివాదానికి కారణమైంది. మంత్రి వైష్ణ‌వ్ చేతుల్లోంచి స్టేట్‌మెంట్ పేప‌ర్లు లాగడం దుమారం రేపుతోంది. ఆ పేప‌ర్లు చింపివేసి .. వెల్‌లోనే వెద‌జ‌ల్లారు. టీఎంసీ ఎంపీల వైఖ‌రిపై ఎన్డీఏ పార్టీలు మండిపడ్డాయి. ఎంపీల ప్ర‌వ‌ర్త‌న తీరును డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ ఖండించారు. ఈ గంద‌ర‌గోళం మధ్యే స‌భ‌ వాయిదా పడింది. గ‌తంలోనూ టీఎంసీ ఎంపీలు.. నూత‌న రైతు చ‌ట్టాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న టైంలో చైర్ మైక్ లాగేసిన  బీభత్సం సృష్టించారు. 




కేంద్ర ఐటీ మంత్రి వైష్ణ‌వ్ చేతుల్లోంచి పేప‌ర్లును టీఎంసీ ఎంపీ శంత‌ను సేన్‌ లాగేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ టైంలోనే కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్ పుర‌తి, ఎంపీ శంత‌ను సేన్ మ‌ధ్య వాగ్వాదం నడిచింది. పెగాస‌స్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను చ‌దువుతున్నప్పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. టీఎంసీ ఎంపీల ప్ర‌వ‌ర్త‌న‌ను బీజేపీ ఎంపీ స్వ‌ప‌న్‌దాస్ గుప్తా ఖండించారు. మంత్రి చేతుల్లోంచి పేప‌ర్ లాగేసిన అంశాన్ని ప్ర‌శ్నించ‌గా.. ఎంపీ ఎంపీ సుకేందు శేఖ‌ర్ రాయ్ స‌మాధాన్ని దాట‌వేశారు.


 


రాజ్య‌స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీలపై చర్యలకు ప్రివిలేజ్ మోషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. టీఎంసీ ఎంపీ శంతను సేన్‌ను సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టీఎంసీ ఎంపీల వైఖ‌రిని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఖండించారు. 


పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాజ్యసభ సభా నాయకుడు పియూష్ గోయల్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, వీ మురళీధర్‌తో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సమావేశమయ్యారు. రాజ్యసభలో టీఎంసీ ఎంపీలు సృష్టించిన గందరగోళంపై వారితో చర్చించారు. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీలపై చర్యలకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. వారిపై ప్రివిలేజ్‌ మోషన్‌ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. 




కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి రాజ్యసభలో తనపై దాడి చేయబోయారని, సహచర ఎంపీలు తనను కాపాడారని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ శంతను సేన్‌ ఆరోపించారు. సభ వాయిదా పడిన తర్వాత హర్దీప్‌ సింగ్‌ తనను బెదిరించడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారాయన. సభ వాయిదా పడిన తరువాత, కేంద్ర మంత్రి హర్దీప్ పురి నీచమైన పద్ధతిలో పిలిచారని.. ఆయన దగ్గరకు వెళ్తే బెదిరించడం మొదలుపెట్టారని మీడియాకు చెప్పారు. తనపై భౌతికంగా దాడి చేయబోయారని.... నేను దాదాపు ఘెరావ్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. సహచరులు దీన్ని గమనించి రక్షించారని.... ఇలా జరుగడం దురదృష్టకమని అభిప్రాయపడ్డారు శంతను సేన్‌. తన పట్ల అనాగరికంగా ప్రవర్తించిన హర్దీప్ సింగ్ పురిపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు తమ పార్టీ వెంటనే ఫిర్యాదు చేసిందని చెప్పారు.