ISRO High Alert: అంతరిక్షం అంటే అంతులేని శూన్యం. ప్రశాంతమైన నిశ్బబ్ద అని భావించే వాళ్లు. కానీ గత దశాబ్ద కాలంగా అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం సంస్థలతోపాటు ప్రైవేటు కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉపగ్రహాలను ప్రయోగిస్తుండటంతో భూమి చుట్టూ ఉన్న కక్ష్యల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముఖ్యంగా లో ఎర్త్ ఆర్బిట్ ప్రాంతం వందలాది ఉపగ్రహాలు, వేల కొద్ది శిథిలాలతో నిండిపోయింది. ఈ క్రమంలో, భారతదేశపు అంతరిక్ష ఆస్తులను కాపాడుకోవడానికి ఇస్రోకు ఒక సవాలుగా మారింది.
2025 లెక్కలు చెబుతున్న ఆశ్చర్యకరమైన విషయాలు
భారతీయ అంతరిక్ష పరిస్థితుల అంచనా నివేదిక 2025 ప్రకారం, భారత ఉపగ్రహాలు గతేడాది సుమారు 1.5 లక్షల సార్లు ఇతర వస్తువులకు అతి సమీపంగా వెళ్లాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి క్లోజ్ అప్రోచ్ హెచ్చరికలు సుమారు లక్షా అరవై వేల వరకు నమోదు అయ్యాయి. ఇందులో అత్యధిక శాతం హెచ్చరికలు అమెరికా స్పేస్ కమాండ్కు చెందిన కంబైన్డ్ స్పేస్ ఆపరేషన్స్ సెంటర్ నుంచి అందినవే.
ప్రతి హెచ్చరిక ఒక సంభావ్య ప్రమాదాన్ని సూచిస్తుంది. అంటే, అంతరిక్షంలో తిరుగుతున్న ఏదైనా శిథిలం లేదా మరో ఉపగ్రహం మన శాటిలైట్కు అత్యంత దగ్గరగా వచ్చి, ఢీ కొనే అవకాశం ఉందని అర్థం. 2025లో నమోదైన ఈ గణాంకాలు అంతరిక్షంలో పెరుగుతున్న ప్రమాదకర వాతావరణానికి నిదర్శనం.
అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్కు కారణం ఏంటీ
అంతరిక్షంలో ఈ స్థాయిలో ట్రాఫిక్ పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలు ఇంటర్నెట్ సర్వీస్ల కోసం వందలాది ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఒకే రోజులో వందకు పైగా ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నాయి. దీని వల్ల కక్ష్యల్లో స్పేస్ తగ్గిపోయి, ఉపగ్రహాల మధ్య దూరం తగ్గిపోతోంది. 2025లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 315 విజయవంతమైన ప్రయోగాలు జరిగాయి. వీటి ద్వారా 4, 651 వస్తువులు అంతరిక్షంలోకి పంపారు. ఇది 2004లోని 254 ప్రయోగాలు, 2023లోని 212 ప్రయోగాలతో పోలిస్తే భారీ పెరుగుదల ప్రస్తుతం కక్ష్యలో 4, 198 క్రియాశీల ఉపగ్రహాలు పని చేస్తున్నాయి.
ప్రమాదాలకు తావులేకుండా ఇస్రో రక్షణ చర్యలు
పెరుగుతున్న ఈ ప్రమాదాల దృష్ట్యా ఇస్రో హై అలర్ట్ మోడ్లోకి వెళ్లింది. తన ఉపగ్రహాలను కాపాడుకోవడానికి 2025లో ఇస్రో అనేక రక్షణ చర్యలు చేపట్టింది. ఏదైనా వస్తువు ఢీకొనే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, ఉపగ్రహం దిశను లేదా ఎత్తును మార్చడానికి కామ్ అంటారు. 2025లో ఇస్రో మొత్తం 18 సార్లు ఇలాంటి రిస్క్ తీసుకుంది. ఇందులో 14 విన్యాసాలు LEO, 4 విన్యాసాలు GEOలో జరిగాయి.
సాధారణంగా ఉపగ్రహాలు తమ కక్ష్యను మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అయితే ఇతర వస్తువులతో ఢీ కొనే ప్రమాదం ఉందని గుర్తిస్తే ప్రణాళికలను మార్చాల్సి వస్తుంది. ఇలా 2025లో ఎల్ఈవో శాటిలైట్ల కోసం 82 సార్లు, GEO శాటిలైట్ల కోసం 2 సార్లు ప్లాన్ ఛేంజ్ చేశారు.
స్పేస్ ఒక టిప్పింగ్ పాయింట్కు చేరిందా?
నిపుణులు చెబుతున్నట్టు అంతరిక్షం ఒక కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న శిథిలాల కంటే క్రియాశీల ఉపగ్రహాల సంఖ్య పెరిగిపోతోంది. దీని వల్ల నిరంతరం నిగా ఉంచడం, సమన్వయం చేసుకోవడం అత్యంత కీలకంగా మారింది. ఒక చిన్న ప్రమాదం కూడా వేలకొద్ది శిథిలాలను సృష్టిస్తుంది. ఇది మరిన్ని ఉపగ్రహాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది.
