bride became  mother  day after her wedding:   వివాహం అనేది ఏడడుగుల బంధం.. జీవితాంతం కలిసి ఉండాలనే బాసల కలయిక. పెళ్లయ్యాక కొత్త దంపతులు తమ వారసుల కోసం కలలు కనడం సహజం. కానీ, పెళ్లయిన మరుసటి రోజే ఆ వధువు ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి, అటు అత్తారింటి వారిని, ఇటు స్థానికులను నివ్వెరపోయేలా చేసింది. గ్రేటర్ నోయిడాలోని దంకౌర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నొప్పులతో ఆసుపత్రికి.. డాక్టర్ల మాటలకు మైండ్ బ్లాక్! 

దంకౌర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి, బులంద్‌షహర్‌కు చెందిన యువతితో సోమవారం అట్టహాసంగా వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిశాక వధువు ఎంతో సంబరంగా అత్తవారింట్లో అడుగుపెట్టింది. అయితే, మంగళవారం సాయంత్రం ఆమెకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కంగారుపడిన అత్తమామలు ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆమె ఏడు నెలల గర్భిణి అని, ప్రసవ వేదన పడుతోందని చెప్పడంతో వరుడి కుటుంబ సభ్యుల మైండ్ బ్లాక్ అయ్యింది. కొద్దిసేపటికే ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

 పెళ్లి ముందే పక్కా స్కెచ్? 

ఈ విషయం తెలియగానే వరుడి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోయింది. ఐదు నెలల క్రితమే నిశ్చితార్థం జరిగిందని, అప్పట్లో ఆమె గర్భవతి అన్న విషయాన్ని తమ వద్ద దాచిపెట్టి వంచించారని వారు ఆరోపిస్తున్నారు. నిశ్చితార్థం సమయంలో తాము ఆమెను కలిశామని, కానీ కడుపులో రాళ్లు ఉన్నాయని, ఆ ఆపరేషన్ వల్ల కడుపు ఉబ్బెత్తుగా ఉందని వధువు కుటుంబీకులు తమను నమ్మించారని వరుడు వాపోయాడు. ఈ మోసంపై వరుడి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ముగిసిన కథ.. పుట్టింటికే వధువు! 

ఆసుపత్రిలో జరిగిన ఈ హైడ్రామాతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తమను నమ్మించి గొంతు కోశారని, అటువంటి వధువును తమ ఇంట్లోకి రానిచ్చేది లేదని వరుడి కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు. చివరికి పోలీసులు , పెద్దల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం, ఆ వధువును , పుట్టిన బిడ్డను ఆమె తల్లిదండ్రులు తమ వెంట బులంద్‌షహర్‌కు తీసుకెళ్లారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే పెళ్లి, ప్రసవం, విడాకుల స్థాయి గొడవ జరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.