Telangana Bhavan: దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం(తెలంగాణ భవన్)ను ప్రారంభానికి సిద్ధం అయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4వ తేదీన అంటే రేపే తెలంగాణ భవన్ ను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దిల్లీకి వెళ్లారు. అక్కడే ఉండి నిర్మాణ పనులను పరిశీలించారు. దిల్లీలో తెలంగాణ పదం పలకాడానికి, వినడానికి అవకాశాలు లేని పరిస్థితుల నుంచి అక్కడ బీఆర్ఎస్ సొంత కార్యాలయాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.


తెలంగాణ భవన్ ప్రారంభోత్సవంలో పూజా కార్యక్రమాల నిర్వహణ


అలాగే కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే యాగం, హోమం, ఇతర పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నిర్దేశిత గడువుకన్నా ముందే ఈ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో దక్షిణాది రాజకీయ పార్టీల్లో అన్నాడీఎంకే తర్వాత ఢిల్లీలో కార్యాలయాన్ని స్థాపించుకున్న రెండో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ రికార్డు సాధించింది. బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ ఫ్రంట్ వ్యూను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. పార్టీ అధినేత కేసీఆర్ 14 ఫీట్ల కటౌట్ బోర్డు ఫొటో, తెలంగాణ మ్యాప్, తెలంగాణ తల్లి విగ్రహం, కాకతీయ కళాతోరణం, పార్టీ గుర్తు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 


ముఖ్యనేతల కోసం 18 అద్భుతమైన రూమ్స్..!


గతేడాది వసంత్ విహార్‌లో BRS ఆఫీస్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన మంత్రులు, ఎంపీల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణాదికి చెందిన పార్టీల్లో ఢిల్లీలో కార్యాలయం ఉన్న తొలి పార్టీ తమదేనని BRS చెబుతోంది. అంతే కాదు. దేశ రాజధానిలో 20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవానాన్ని నిర్మించారు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా హాల్, పర్మినెంట్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 జనరల్ సెక్రటరీ రూమ్స్ నిర్మించారు. ఫస్ట్ ఫ్లోర్ లో ప్రెసిడెంట్ చాంబర్, పేషీ, సీఎం కాన్ఫరెన్స్ హాల్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ లో ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం 2 సూట్లు, పార్టీ ముఖ్యనేతల కోసం 18 రూమ్లను అద్భుతమైన డిజైన్లతో తీర్చిదిద్దారు.హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ ఉన్నట్టుగానే... ఢిల్లీలోనూ అదే తరహాలో తెలంగాణ భవన్‌ను కట్టారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ఈ తెలంగాణ భవన్‌ను వినియోగించుకోవాలని చూస్తోంది పార్టీ.