ఏటా దేశంలోని మహారాష్ట్రలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. అక్కడ సంవత్సరంలో 22 వేల కంటే ఎక్కువ ఆత్మహత్య కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత తమిళనాడులో సుమారు 15 వేలు, మధ్యప్రదేశ్ లో 13,500 బలవన్మరణ కేసులు నమోదవుతున్నట్లు వివరించింది. దేశం మొత్తం మీద గతేడాది లక్షా 64 వేల మంది సూసైడ్ చేసుకున్నట్లు ఈ డేటా తెలిపింది. 


రైతు ఆత్మహత్యల్లో తెలంగాణకు నాలుగో స్థానం.. 
ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్ నేరాలు తెలంగాణలో ఎక్కువగా నమోదు అయ్యాయి. మొత్తం 8693 కేసులు నమోదు అవ్వగా.. 2019లో 11,465, 2020లో 12,985, 2021లో 20,759కి చేరుకున్నాయి. ఈ తీరు చూస్తే రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అలాగే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 2021లో దేశ వ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేస్కున్నారు. వీటిలో 4,806 మంది రైతులు, 5,121 మంది కౌలు రైతులు ఉన్నారు. అలాగే 5 వేల 563 మంది రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2,429 మంది రైతులు, 1,329 మంది కౌలు రైతులు, 1,424 మంది రైలు కూలీలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కర్ణాటక, ఏపీ రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. మన దగ్గర 303 మంది రైతులు, 49 మంది కౌలు రైతులు, ఏడుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 


వృద్ధులపై దాడుల్లో మూడో స్థానంలో..! 
వృద్ధులపై దాడుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ముందంజలోనే ఉంది. 1952 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 6,190 కేసులతో మొదటి స్థానంలో నిలవగా... మధ్య ప్రదేశ్ 5,273 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో దళిత మహిళలను అవమానించిన కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 151 కేసులు నమోదు కాగా.. అందులో ఏపీవి 83, తెలంగాణవి 21 కేసులు ఉండడం గమనార్హం. లైంగిక అక్రమ రవాణా కేసుల్లో కూడా తెలంగాణ ముందు వరుసలోనే ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 2083 కేసులు నమోదు అవ్వగా.. తెలంగాణలోనే 347 కేసులు నమోదయ్యాయి.