Stalin: ఒకే దేశం-ఒకే ఎన్నికల చట్టం ప్రధాని మోడీ(Narendra Modi) నియంతలా మారేందుకు ఉపయోగపడుతుంది తప్ప... దేశానికి,ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని తమిళనాడు(Tamilanadu) ముఖ్యమంత్రి స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వైపు దేశాన్ని తీసుకెళ్లేందుకు బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందన్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నికల విధానం దేశానికి మంచిది కాదని స్టాలిన్ అన్నారు. ఎన్డీఏ వ్యతిరేక పక్షాలే కాదు...భాజపా మిత్ర పక్షాలు సైతం జమిలి(Jamili)కి మద్దతు ఇవ్వకూడదని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. దేశం, రాజ్యాంగాన్ని రక్షించుకుందామంటూ ఆయన పిలుపునిచ్చారు.
దేశం మొత్తం ఒకేపార్టీ పాలనలోకి తీసుకురావాలని బీజేపీ యత్నిస్తోందని ...అందుకే ఒకే దేశం- ఒకే ఎన్నికలంటూ కొత్త పల్లవి ఎత్తుకుందని స్టాలిన్ విమర్శించారు. దీన్ని ఆదిలోనే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ (BJP) ఒకే వంటకాలతోపాటు ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి తీసుకురావాలని కోరుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వమని దీన్ని హరించేలా బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రంలో ఒకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలను నాశనం చేయాలని చూస్తోందన్నారు.
జమిలి ఎన్నికలో ఓ వ్యక్తి నియంతంగా మారడానికి ఉపయోగపడుతుందని...అది బీజేపీకి కూడా మంచిది కాదంటూ పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి స్టాలన్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. బీజేపీ మిత్రపక్షాలు సైతం దీన్ని గట్టిగా వ్యతిరేకించాలని కోరారు. లేకపోతే మీ పార్టీలే కనుమరుగు అవుతాయని స్టాలిన్ హెచ్చరించారు. ప్రజా పాలనపై విశ్వాసం ఉన్న ఏ ప్రజాస్వామ్య పార్టీ అయినా ఈ చర్యకు మద్దతు ఇవ్వకూడదన్నారు.
డీఎంకే(DMK) న్యాయ విభాగం సదస్సుకు హాజరైన స్టాలిన్...తమిళనాడును, తమిళ భాషను కాపాడుకోవడంలో డీఎంకే న్యాయ విభాగం చాలా కీలకంగా వ్యవహరించిందని ఆయన కొనియాడారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో పార్టీపై దాఖలుచేసిన రాజకీయ కేసులను ధైర్యంగా ఎదుర్కొవడంలో న్యాయ విభాగం సేవలు మరువలేనివన్నారు. అలాగే పార్టీ నేతలు, శ్రేణులకు ఎల్లవేళలా అండగా నిలుస్తోందని, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ తమ పార్టీ న్యాయ విభాగం చేసిన కృషిని DMK అధినేత కొనియాడారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నిర్మాణం పరిమితి వంటి అనేక సవాళ్లను ధైర్యంగా న్యాయ విభాగం ఎదుర్కొందన్నారు. డీఎంకే గుర్తు,కరుణానిధిని అర్థరాత్రి అరెస్ట్ చేయడం, కేంద్ర మాజీమంత్రిని అరెస్ట్ చేయడం వంటి కేసుల్లో న్యాయ విభాగం కీలక పాత్ర పోషించిందన్నారు. అన్నాదురై స్మారక చిహ్నం పక్కన కరుణానిధి స్మారకం ఉంచడానికి మెరీనా బీచ్లో స్థలం కోసం చేసిన న్యాయపోరాటాన్ని ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య వాగ్వాదంపైనా సీఎం స్టాలిన్ స్పందించారు. డీఎంకే ప్రభుత్వాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా చిత్రీకరించేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. జాతీయ గీతం ప్లే చేయలేదంటూ గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారని...ఆయన్ను ఆ పదవినుంచి మార్చొద్దని కేంద్రాన్ని కోరుతున్నానని స్టాలిన్ అన్నారు. ఎందుకంటే గవర్నర్ ఎంత ఎక్కువ మాట్లాడితే బీజేపీ చర్యలు బాహ్య ప్రపంచానికి అంత ఎక్కువ తెలుస్తాయన్నారు. డీఎంకేను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని చదవకుండానే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయి తమిళ ప్రజలను అవమానించిన గవర్నర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని కోరుతూ సమావేశంలో తీర్మానం చేశారు.