రామ జన్మ స్థలంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం సోమవారం (నవంబరు 20) కొత్త చిత్రాలను విడుదల చేసింది. ఇవి ఓ క్రేన్ ద్వారా తీసిన ఫోటోలు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలను షేర్ చేశారు. ‘‘నిర్మాణంలో ఉన్న శ్రీరామ జన్మభూమి ఆలయం క్రేన్ నుంచి తీసిన కొన్ని చిత్రాలు’’ అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం వెల్లడించింది. ఎన్నో వివాదాస్పద గొడవల నడుమ కోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో ఈ శ్రీరాముడి ఆలయం నిర్మితం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆలయ పవిత్రోత్సవం జనవరి 22న జరుగుతుంది.


జనవరి 22న జరగనున్న రామాలయంలో రామ్ లాలా స్వామివారి పవిత్రోత్సవానికి ముందు, నిర్మాణంలో ఉన్న ఆలయ చిత్రాలను భక్తులకు అనేకసార్లు విడుదల చేశారు. ఆ క్రమంలోనే సోమవారం కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం.. నిర్మాణంలో ఉన్న రామ మందిరం, కాంప్లెక్స్ క్రేన్ నుంచి కొన్ని చిత్రాలను తీసి 'ఎక్స్' లో అప్‌లోడ్ చేసింది, అవి చాలా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, భారీగా ఉన్నాయి. అందులో అందమైన శిల్పాలు చెక్కారు. ఆలయ వైభవం ఎంత ఘనంగా ఉంటుందనేది ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది.